ఏపీలో వారందరి పింఛన్‌లు నిలిపివేశారు (హోల్డ్).. ఈ నెల నుంచి డబ్బులివ్వరు, కారణం ఇదే!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌లపై ఫోకస్ పెట్టింది.. పింఛన్‌ను రూ.4వేలకు పెంచింది, దివ్యాంగులకు అయితే రూ.6వేలు. దీర్ఘకాలిక వ్యాధులు, మంచానికి పరిమితమైన వారికి రూ.10వేలు, రూ.15వేల చొప్పున పింఛన్‌లు అందిస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోటాలో పింఛన్‌లు తీసుకుంటున్నవారిలో భారీగా అనర్హులు ఉన్నట్లు గుర్తించింది. అందుకే దివ్యాంగుల కోటాలో తనిఖీలు చేయిస్తోంది. కొందరికి ఎలాంటి లోపం లేకపోయినా.. లోపం ఉన్నట్లుగా సర్టిఫికేట్లు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో.. మరోసారి దివ్యాంగులకు వైద్యులతో తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటున్నవారికి నోటీసులు జారీ చేసి రీవెరిఫికేషన్ కోసం పిలుస్తున్నారు.. వారిలో అనర్హుల్ని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నోటీసులు అందించినా సరే రీ వెరిఫికేషన్‌కు వెళ్లడం లేదట. ఇలా నోటీసులు పంపించినా తనిఖీలు (రీ వెరిఫికేషన్) కు హాజరుకాని వారికి.. ఆగస్టు 1, 2025 నాడు ఇవ్వాల్సిన పింఛన్‌లు హోల్డ్‌లో ఉంచారు. వీరందరికి మెసేజ్‌లు పంపారు.. రీ వెరిఫికేషన్ రిపోర్ట్ తర్వాత అర్హత ఉన్నవారందరికి మళ్లీ పింఛన్ ఇస్తారు. ఈ మేరకు ప్రభుత్వం పంపించిన మెసేజ్‌లో పింఛన్ ఐడీతో పాటుగా రీ వెరిఫికేషన్‌ కోసం రావాలని నోటీసులు పంపినా హాజరుకాకపోవడంతో పింఛన్‌ను ఆగస్టు 1 2025 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెర్ప్ నుంచి మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇలా పింఛన్‌లు నిలిపివేసినవారు ఆందోళనచెందాల్సిన అవసరం లేదు.. రీ వెరిఫికేషన్ తర్వాత మళ్లీ పింఛన్‌లు పునరుద్ధరిస్తారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు ఎలాంటి సమస్యలు లేకపోయినా సరే.. వినికిడి లోపం, మానసిక సమస్యలు ఉన్నాయని సదరం సర్టిఫికేట్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది.. ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో చాలామంది అనర్హులుగా తేలారట. ఈ మేరకు ప్రభుత్వం అనర్హులు జాబితాను సిద్ధం చేసిందని చెబుతున్నారు.. ఇంకా కొందరు ఈ పరీక్షలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు. అందుకే వీరి పింఛన్‌లను హోల్డ్‌లో పెట్టారు.. రీ వెరిఫికేషన్ తర్వాతే వీరి పింఛన్‌లపై క్లారిటీ వస్తుంది. కొద్ది నెలలు చూసిన తర్వాత వీరిపై అనర్హత వేటు పడుతుందనే చర్చ జరుగుతోంది. అలాగే అనర్హులు జాబితాను త్వరలోనే విడుదల చేసి.. వారికి పింఛన్‌లు రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్‌ అందిస్తామని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఒకవేళ ఒకటో తేదీన కనుక సెలవు దినమైతే ముందు రోజు పింఛన్ పంపిణీ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా ఏదో ఒక జిల్లాకు వెళ్లి స్వయంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు.