తెలంగాణలో సొంత ఇల్లు లేని నిరుపేదలందరికీ '' అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హతే ప్రాతిపదికగా పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వచ్చే మార్చి-ఏప్రిల్ నెలల్లో పంపిణీ ఉంటుందని కీలక ప్రకటన చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో 'పింక్ షర్ట్' వేసుకున్న వారికే ఇళ్లు ఇచ్చే సంస్కృతి ఉండేదని.. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇళ్ల పంపిణీ కేవలం కమిషన్ల కోసమే జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రిలో కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లను తామే పూర్తి చేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న దాదాపు 36 వేల ఇళ్ల కోసం తమ ప్రభుత్వం రూ. 744 కోట్లు కేటాయించిందని తెలిపారు. 12 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోబోతోందని చెప్పారు. కేవలం మొండి గోడలతో మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కేటాయించే రూ. 5 లక్షల నిధులను అనుసంధానిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేని పేదల కోసం ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే వారు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యలను, ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.సింగరేణి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు 76 జీవో ప్రకారం పట్టాల పంపిణీ పెండింగ్‌లో ఉందని, దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే 12,500 ఇళ్లను మంజూరు చేశామని, చెంచు జాతి వారందరికీ మొదటి విడతలోనే ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, హౌసింగ్ సెక్రటరీతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలన్నింటినీ కొలిక్కి తెస్తామని వివరించారు.