తెలంగాణ రాష్ట్రంలో లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా కొన్ని ఏజెన్సీలు, మరికొందరు అవినీతి అధికారుల అండదండలతో పని చేయని వ్యక్తుల పేర్ల మీద కూడా జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ 'డూప్లికేట్' ఉద్యోగుల వల్ల ప్రతి నెలా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రతి ఉద్యోగి వివరాలను ఆధార్‌తో అనుసంధానించాలని సర్కార్ ఆదేశించింది. ఈ తనిఖీలు పూర్తి కావడంతో దాదాపు 15 వేల మంది ఉద్యోగుల వివరాల్లో పొంతన లేదని.. వారు కేవలం కాగితాల మీద మాత్రమే ఉన్నారని తేలింది. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులు ఆదా కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులపై నిర్వహించిన సమీక్షలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గత రెండు నెలలుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో 12 శాతం వృద్ధి నమోదైంది. అలాగే మైనింగ్ రంగంలో లీకేజీలను అరికట్టడం వల్ల అక్కడ ఏకంగా 22 శాతం వృద్ధి కనిపించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం కూడా గత తొమ్మిది నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుని.. కేంద్ర పథకాలను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పని పట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. రాబోయే బడ్జెట్‌లో ప్రజా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూనే.. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల నుంచి వస్తున్న అదనపు ఆదాయం రాష్ట్ర అభివృద్ధి పనులకు ఊతమివ్వనుంది.