కొత్త సంవత్సరంలో కోటి ఉద్యోగాలు.. టాటా, గోద్రేజ్ సహా దిగ్గజాల భారీ ప్రణాళిక

Wait 5 sec.

TeamLease: ఈ కొత్త సంవత్సరంలో భారీ స్థాయిలో నియామకాలకు దేశంలోని దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉద్యోగ కల్పన అధికంగా ఉండవచ్చని స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ టీమ్ లీజ్ అంచనా వేసింది. క్యాంపస్ నియామకాల పునరుద్ధరణ, టీమ్‌లో పెంపు, వైవిధ్య లక్ష్యాలపై దృష్టి సారించడం వంటి చర్యలు కొత్త ఉద్యోగాల సృష్టికి కారణమవుతున్నాయని పేర్కొంది. ఈ 2026 సంవత్సరంలో ఏకంగా 1 కోటి నుంచి కోటీ 20 లక్షల వరకు ఉద్యోగాలను దేశీయ కార్పొరేట్ రంగం సృష్టించవచ్చని పేర్కొంది. కొత్త స్కిల్స్‌కి ఉన్న గిరాకీకి అనుగుణంగా రిక్రూట్‌మెంట్ ప్లాన్స్ విస్తృతం చేస్తున్నాయని పేర్కొంది. భారీ సంఖ్యలో ఉద్యోగుల నియామకాల కోసం చూస్తున్న కంపెనీల్లో నైపుణ్య సేవల సంస్థ ఈవై ఇండియా ముందంజలో ఉంది. 2026 జూన్ నెల నాటికల్లా 14 వేల నుంచి 15 వేల వరకు నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ హెచ్ఆర్ అధికారి ఆర్తి దువా తెలిపారు. కంపెనీకి క్యాంపస్ నియామకాలు ఎప్పుడూ కీలకమని తెలిపారు. బిజినెస్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీలు, లా కళాశాలలు, అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం 2000 మందిని నియమించుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. డిజిటల్, సరఫరా కార్యకలాపాలు, విభాగాల విస్తరణ వంటి అంశాల్లో సామర్థ్యాలకు అనుగుణంగా ఉద్యోగుల నియామకాలు చేపడతామని డియా జియో ఇండియా కంపెనీ తెలిపింది. లింగ వైవిధ్యాన్ని మెరుగుపరచుకుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల్లో 30 శాతం, నాయకత్వ పదవుల్లో 31 శాతం మేర మహిళలు సేవలందిస్తున్నారు. బ్యాటరీ టెక్, సాఫ్ట్ వేర్ డిఫైన్డ్ వెహికల్స్, హైడ్రోజన్ ఇంధనం, ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ, వాణిజ్య కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో నియామకాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. నియామకాల వ్యూహంలో వైవిధ్యమైన శ్రామిక శక్తిని ప్రముఖ కంపెనీ గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ ఆశిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూ, మహిళల ప్రాతినిధ్యాన్ని 2026-27 నాటికి 31 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని భావిస్తోందట. ఇక టెక్, డేటా సైన్స్, ఏఐ, సపోర్ట్ ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. నాయకత్వ పదవుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది. అలాగే కొత్త ఉద్యోగుల నియామకాలతో పాటుగా ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తామని చాలా కంపెనీలు వెల్లడించాయి.