ఓ హత్యాచారం కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులలో నిందితుడు చాలా రోజుల నుంచి జైలులో ఉన్నంత మాత్రాన బెయిల్ పొందేందుకు అర్హుడు కాలేడని స్పష్టం చేసింది. నేర తీవ్రతను అనుసరించి, నేరానికి పాల్పడిన విధానాన్ని పరిశీలించి నిందితుడికి బెయిల్ ఇవ్వలేమంటూ బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో ఓ వ్యక్తి ఫిస్టులా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నయాన్‌ బిస్వాస్‌ అనే వ్యక్తి కాంపౌండర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే డాక్టర్‌ కుటుంబంతో పాటుగా కాంపౌండర్ నయాన్ బిస్వాస్ ఉండేవాడు. అయితే నమ్మకంగా పనిచేస్తూ ఉండే నయాన్ బిస్వాస్‌లో మరో మనిషి దాగున్నాడని ఆ డాక్టర్ దంపతులకు తెలియలేదు.డాక్టర్ భార్య మీద కన్నేసిన కాంపౌండర్ నయాన్ బిస్వాస్.. 2024 డిసెంబరు 31న దారుణానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న డాక్టర్ భార్య గదిలోకి ప్రవేశించి.. ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. డాక్టర్ భార్య గట్టిగా ప్రతిఘటించడంతో కాంపౌండర్ మరింత రాక్షసుడిగా మారిపోయాడు. ఆమె తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని చీకటి ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యంత అమానుషంగా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి భర్త, డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన కావలి పోలీసులు.. నయాన్‌ బిస్వాస్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుడు నయాన్ బిస్వాస్ బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ కేసులో దర్యాప్తు అధికారి ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులలో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన నేర తీవ్రత తగ్గదని అభిప్రాయపడింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలిస్తే.. నిందితుడు యజమాని ఇంట్లో నమ్మకంగానే ఉంటూ.. ఆయన భార్యపై అఘాయిత్యానికి పాల్పడి నమ్మకం ద్రోహానికి పాల్పడ్డాడని హైకోర్టు అభిప్రాయపడింది. తీవ్రమైన కామవాంఛతో చంపేసిన తర్వాత లైంగిక వాంఛ తీర్చుకుని మృగంలా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులలో బెయిలిస్తే సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.