భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 23 నుంచి నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లూ అక్కడికి చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్.. నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది. అటు సిరీస్‌ను సమం చేయాలని భారత్‌ పట్టుదలతో ఉంది. అయితే ఈ టెస్ట్‌ కోసం టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. కరుణ్ నాయర్, లాంటి ప్లేయర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం.. కొన్నిసార్లు బౌలర్లు విఫలమవడం జట్టుకు ఇబ్బందిగా మారింది.మాంచెస్టర్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. తుది జట్టులో ఈ మార్పు కచ్చితంగా చేయాలని సూచించాడు. నితీశ్ కుమార్ రెడ్డి ప్లేసులో చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను కచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు.నాలుగో టెస్ట్‌లో అయినా కుల్‌దీప్‌కు ఛాన్స్ ఇవ్వండి..“ఈ సిరీస్‌లో బర్మింగ్‌హామ్‌లో జ‌రిగిన రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాద‌వ్‌ను ఆడించాల‌ని నేను సూచించా. కానీ అత‌డికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత లార్డ్స్‌లోనైనా ఛాన్స్ ఇవ్వండని చెప్పా. కానీ అప్పుడు కూడా అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. కానీ మాంచెస్టర్ టెస్ట్‌లో మాత్రం కుల్‌దీప్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాలి. దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ బ్యాటర్లకు.. కుల్‌దీప్ యాదవ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. వారు అతడి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకోవడానికి ఇబ్బంది ప‌డ‌తారు. కుల్‌దీప్‌ బంతిని రెండు వైపులా టర్న్ చేయగలడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా వికెట్లు తీయగలడు. నితీశ్ కుమార్ రెడ్డి ప్లేసులో కుల్‌దీప్‌కు ఛాన్స్ ఇవ్వాలి” అని హర్భజన్ సింగ్ అన్నాడు.మూడో టెస్ట్ టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో డెప్త్ కోసమే కుల్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకోలేకపోతున్నట్లు చెప్పాడు. దీంతో బ్యాటింగ్ చేసే సామర్థ్యమున్న నితీశ్, వాషింగ్టన్‌ సుందర్‌లను ఆడించినట్లు పరోక్షంగా వెల్లడించాడు. మరి నాలుగో టెస్టులో అయినా.. కుల్‌దీప్ యాదవ్‌కు చోటు దక్కుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.