ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ నుంచి నితీశ్‌ కుమార్ రెడ్డి ఔట్

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. తెలుగు ఆల్‌రౌండర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి మోకాలికి గాయమైందని తెలుస్తోంది. దీంతో ఇండోర్ ట్రైనింగ్ సెషన్లో అతడు పాల్గొనలేదు. దీంతో జులై 23న ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో నితీశ్ రెడ్డి స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను ఆడించే అవకాశం ఉంది. అయితే నాలుగో టెస్టులో ఆడించాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచిస్తున్నాడు.ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో నితీశ్ ఆడలేదు. రెండో టెస్టులో బరిలోకి దిగినప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో నితీశ్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చి భారత్‌కు శుభారంభం ఇచ్చిన.. ఈ ఆంధ్రా ఆల్‌రౌండర్.. బ్యాటింగ్‌లోనూ 30 పరుగులతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన నితీశ్.. 193 పరుగుల లక్ష్య చేధనలో భారత్ టపాటపా వికెట్లు కోల్పోయిన తరుణంలో 53 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేశాడు.ఇక నాలుగో టెస్టు విషయానికి వస్తే.. మాంచెస్టర్లో‌ వర్షం కురుస్తుండటంతో భారత ఆటగాళ్లు ఇండోర్ నెట్ ప్రాక్టీస్ చేశారు. అయితే నితీశ్‌తోపాటు కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, బుమ్రా, పంత్, వాషింగ్టన్ సుందర్ ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు. భారత్‌ జట్టును ఇప్పటికే గాయాలు వేధిస్తున్నాయి. మూడో టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. దీంతో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించగా.. పంత్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు. నాలుగో టెస్టులో అర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతాడని భావించగా.. ప్రాక్టీస్ సెషన్లో అతడి ఎడమ చేతికి గాయమైంది. దీంతో అతడు కూడా మాంచెస్టర్ టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు దాదాపుగా లేవు. దీంతో యువ పేసర్ అన్షుల్ కాంభోజ్‌ను జట్టులోకి తీసుకున్న బీసీసీఐ.. అతణ్ని ఇంగ్లాండ్‌కు పంపించింది. :మాంచెస్టర్ టెస్టులో బుమ్రాను ఆడించడం ఖాయంగా కనిపిస్తుండగా.. ఆకాశ్‌దీప్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కాంభోజ్‌ లేదా ప్రసిద్ధ్ కృష్ణను ఆడించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టుల్లో కరుణ్ నాయర్‌ ఆడినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాలనే డిమాండ్ వినిపిస్తోంది. .. జురెల్‌ను వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకొని.. పంత్‌ను కేవలం బ్యాటర్‌గా ఆడిస్తారా లేదంటే విశ్రాంతి ఇస్తారా? అనేది కూడా చూడాలి.