తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కాలేజీ ఆవరణలోనే, ఇక ఆ ఇబ్బందులు ఉండవ్

Wait 5 sec.

తెలంగాణలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇక ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ భారీ క్యూలైన్ల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఇక నుంచి ఆ టెన్షన్ అవసరం లేదు. కాలేజీ ఆవరణలోనే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో విద్యార్థుల కోసం తపాలా శాఖ ఆధ్వర్యంలో కాలేజీల్లో ఇంటర్ బోర్డు, ఉడాయ్ (UIDAI), తపాలా శాఖల సంయుక్త భాగస్వామ్యంతో జూనియర్ కళాశాలల్లో ఈ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు వివరాలను నవీకరించుకోవడానికి లేదా కొత్త ఆధార్‌కార్డులను పొందడానికి ఈ అవకాశం కల్పిస్తున్నారు.మంగళవారం హైదరాబాద్ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక ఆధార్ మేళా ప్రారంభమైంది. తపాలా శాఖ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ జి. హైమావతి ఈ వివరాలను వెల్లడించారు. ప్రతి జూనియర్ కళాశాలలో కూడా ఈ శిబిరాలు కొనసాగుతాయని ఆమె తెలిపారు. విద్యార్థులు మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇది ఆధార్ సంబంధిత పనుల కోసం బయట ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా, సమయాన్ని ఆదా చేయడానికి విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తపాలా శాఖ అధికారులు త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆధార్ నమోదు శిబిరాలను ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తొలుత పదో తరగతి విద్యార్థుల ఆధార్‌ను నవీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో మూడు, నాలుగు రోజుల పాటు శిబిరాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు జి.హైమావతి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధార్ సేవలు సులభంగా అందుబాటులోకి రావడమే కాకుండా, విద్యా సంబంధిత కార్యకలాపాలకు ఆధార్ అనుసంధానం మరింత సులభతరం అవుతుంది. ఆధార్ కార్డు అనేది ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రయోజనాలను పొందడానికి కీలకమైన పత్రం కాబట్టి, ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.