భారత రాజకీయాల్లో జగదీప్ ధన్‌ఖడ్ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు. అదే సమయంలో దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న అత్యంత వివాదాస్పద వ్యక్తిగానూ నిలిచారు. తొలుత లాయర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జగదీప్ ధన్‌ఖడ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా.. ఆ తర్వాత గవర్నర్‌గా ఒక్కో మెట్టును ఎక్కుతూ వచ్చి, చివరికి దేశంలోనే రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించారు. గవర్నర్, ఉపరాష్ట్రపతి పదవుల్లో ఉన్నప్పుడు జగదీప్ ధన్‌ఖడ్ అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో తరచూ మమతా బెనర్జీ ప్రభుత్వంతో జగదీప్ ధన్‌ఖడ్ వివాదాల్లో ఉండేవారు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టాక.. పార్లమెంటులోనూ, బయటా.. భారత న్యాయవ్యవస్థపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత రాజకీయాల్లోనే ఆయన ఒక వివాదాస్పద ఉపరాష్ట్రపతిగా నిలిచారు. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఆరోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిన రాజీనామా లేఖలో జగదీప్ ధన్‌ఖడ్ రాశారు. వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి రాజీనామా దేశంలో ప్రకంపనలు రేపింది. దీని వెనుక రాజకీయ కారణాలూ లేకపోలేదని చర్చ జరుగుతోంది. భారతదేశ చరిత్రలో పరివర్తనాత్మకమైన కాలంలో.. ఉపరాష్ట్రపతిగా సేవ చేయడం తనకు నిజమైన గౌరవంగా భావిస్తున్నట్లు రాజీనామా సందర్భంగా ధన్‌ఖడ్ పేర్కొన్నారు. రాజీనామా లేఖలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఒక ఆర్థిక శక్తిగా, ప్రపంచ స్థాయిలో ఎదగడంలో తాను ఒక భాగం అయినందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.కాంగ్రెస్ ఆరోపణలుఇది సాధారణంగా జరిగింది కాదని.. దాని వెనుక ఏదో పెద్ద విషయం దాగి ఉందని ఆరోపించింది. తావిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన మొదటి బీఏసీ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారని.. అయితే సాయంత్రం 4.30 గంటలకు మాత్రం రాలేదని అదే ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం అయి ఉంటుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. కేంద్ర మంత్రుల గైర్హాజరీపై ధన్‌ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఆ సమావేశాన్ని షెడ్యూల్ చేశారని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు మధ్య ఏదో జరిగిందని.. అందుకే ఇద్దరు కేంద్ర మంత్రులు సాయంత్రం సమావేశానికి హాజరు కాలేదని పేర్కొన్నారు.జగదీప్ ధన్‌ఖడ్ విద్యాభ్యాసం1951 మే 18న రాజస్థాన్‌‌లోని ఝున్‌ఝును జిల్లాలోని కిథానా గ్రామంలో జగదీప్ ధన్‌ఖడ్ జన్మించారు. జైపూర్‌ మహారాజా కాలేజీ నుంచి బీఎస్సీ ఫిజిక్స్‌లో ఆనర్స్ డిగ్రీని పొందారు. 1978-79లో రాజస్థాన్ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1979 నవంబర్ 10న రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో లాయర్‌గా పేరు నమోదు చేసుకున్నారు. 1990 మార్చి 27వ తేదీన రాజస్థాన్ హైకోర్టు జగదీప్ ధన్‌ఖడ్‌ను ను సీనియర్ అడ్వకేట్‌గా నియమించింది. నాటి నుంచి ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ.. స్టీల్, బొగ్గు, మైనింగ్, అంతర్జాతీయ వాణిజ్య ఆర్బిట్రేషన్ వంటి రంగాల్లో న్యాయ సేవలు అందించారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో ధన్‌ఖడ్ వాదనలు వినిపించారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించే వరకు.. ఆయన రాష్ట్రంలోని అత్యంత సీనియర్ డిజిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్‌గా కొనసాగారు. జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ ప్రస్థానంమొట్టమొదట 1989లో తన స్వస్థలమైన ఝున్‌ఝును పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున జగదీప్ ధన్‌ఖడ్ పోటీ చేశారు. 9వ లోక్‌సభకు ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1990 నుంచి 1991 వరకు చంద్రశేఖర్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో అజ్మీర్‌‌లోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే లోక్‌సభ, రాజస్థాన్ అసెంబ్లీలోని పలు కీలక కమిటీల్లో జగదీప్ ధన్‌ఖడ్ సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా.. ఆయన యూరోపియన్ పార్లమెంట్‌కు పార్లమెంటరీ గ్రూప్ డిప్యూటీ లీడర్‌గా ఒక ప్రతినిధి బృందంలో కూడా పనిచేశారు.జగదీప్ ధన్‌ఖడ్ అధిరోహించిన పదవులుజగదీప్ ధన్‌ఖడ్‌కు స్పోర్ట్స్ అంటే ఎంతో ఆసక్తి. గతంలో రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్, రాజస్థాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్‌లో లైఫ్‌టైమ్ మెంబర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఐసీసీ కమిషన్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఐసీసీ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కూడా సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ఎక్స్-అఫీషియో ఛాన్సలర్‌గా, పంజాబ్ యూనివర్సిటీ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్‌గా కూడా సేవలు అందించారు.బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్‌ఖర్ వివాదాలు2019 జూలైలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా జగదీప్ ధన్‌ఖర్ నియమితులయ్యారు. 2022 జూలై వరకు సరిగ్గా ఆ పదవిలో 3 ఏళ్లు ఉన్నారు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో జగదీప్ ధన్‌ఖడ్‌కు కు తరచు బహిరంగంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాజ్ భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజ్యాంగపరమైన విభేదాలను, అధికార పరిధికి సంబంధించిన అనేక అంశాలపై తేడాలు వచ్చాయి. దీంతో జగదీప్ ధన్‌ఖడ్ బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ కార్యకలాపాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మమతా బెనర్జీ పలుమార్లు బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు.ధన్‌ఖడ్ వివరణదీదీ ఆరోపణలను ఖండించిన ధన్‌ఖడ్.. తాను కేవలం రాజ్యాంగంలోని విధులను మాత్రమే నిర్వహిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన మార్గదర్శకాలు అందిస్తున్నట్లు చెప్పారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం తన బాధ్యత అని గుర్తు చేశారు. బెంగాల్‌లోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో గవర్నర్‌కు, దీదీ సర్కార్‌కు తీవ్ర ఘర్షణలు జరిగాయి. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా 24 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించారని ధన్‌ఖడ్ ఆరోపించారు. ట్వీట్ల యుద్ధంఎక్స్ (ట్విటర్)లో తరచుగా బెంగాల్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై జగదీప్ ధన్‌ఖడ్ విమర్శలు చేసేవారు. దీంతో విసిగిపోయిన మమతా బెనర్జీ.. 2022 జనవరిలో తన ఎక్స్ ఖాతాలో ధన్‌ఖడ్‌ను ను బ్లాక్ చేశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిత్యం గవర్నర్ ట్వీట్లను చూడటం చిరాకు తెప్పిస్తుందని.. ఆయన రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని నాడు దీదీ తీవ్ర ఆరోపణలు చేశారు.కీలక బిల్లులు, ఫైల్స్ పెండింగ్రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొన్ని కీలక బిల్లులను గవర్నర్ నిలిపివేశారని.. చాలా ప్రభుత్వ ఫైళ్లను అనవసరంగా పెండింగ్‌లో ఉంచారని మమతా బెనర్జీ.. జగదీప్ ధన్‌ఖడ్‌నుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ తీరు వల్ల ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలుగుతోందని ఆమె వాదించారు. హౌరా కార్పొరేషన్ బిల్లు సహా పలు బిల్లులపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. అవి పెండింగ్‌లో పడ్డాయి.సీబీఐ అరెస్ట్‌లు, గవర్నర్ అనుమతి2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. నారద కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలను (అప్పటి మంత్రులు సహా) సీబీఐ అరెస్ట్ చేసింది. దీనికి గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వడం మరోసారి గవర్నర్ వర్సెస్ దీదీ సర్కార్‌గా మారింది. నిత్యం వివాదాలతో విసిగిపోయిన దీదీ.. జగదీప్ ధన్‌ఖడ్‌ను ను గవర్నర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పలుమార్లు లేఖలు రాశారు. ఆయన రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దీదీ ఆరోపించారు. ఇలా బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో జగదీప్ ధన్‌ఖడ్ నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఉపరాష్ట్రపతిగా న్యాయవ్యవస్థపై ఆరోపణలుబెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో జగదీప్ ధన్‌ఖడ్ 2022 జూలైలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థపై జగదీప్ ధన్‌ఖర్‌ చేసిన అనేక సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అదే సమయంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజనపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.న్యాయవ్యవస్థ "సూపర్ పార్లమెంట్"గా మారడంపై విమర్శలున్యాయమూర్తులు.. చట్టాలు చేసే, కార్యనిర్వాహక విధులు నిర్వర్తించే, ఒక సూపర్ పార్లమెంట్‌లా వ్యవహరించే ప్రజాస్వామ్యాన్ని తాము కోరలేదని జగదీప్ ధన్‌ఖడ్ బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. జడ్జిలకు ఎలాంటి జవాబుదారీతనం లేదని.. ఎందుకంటే చట్టాలు వారికి వర్తించవని వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరంరాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు అంగీకారం తెలపడానికి లేదా తిరస్కరించేందుకు ఒక నిర్దిష్ట సమయ పరిమితిని విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు బిల్లులను ఆమోదించడానికి రాజ్యాంగంలో గడువు నిర్దేశించలేదని పేర్కొన్నారు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వడానికి ఏ ప్రాతిపదికన వీలు కల్పించారని సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ఆర్టికల్ 142పై వ్యాఖ్యలుభారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 (సుప్రీంకోర్టుకు అదనపు అధికారాలు)ను జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఆర్టికల్.. ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఎల్లవేలలా న్యాయవ్యవస్థకు అందుబాటులో ఉండే అణు క్షిపణిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిమితులను అతిక్రమిస్తోందని ఆరోపించారు.న్యాయవ్యవస్థ జవాబుదారీతనం, పారదర్శకతపై విమర్శలురాజకీయ నాయకులు ఆస్తులు బహిర్గతం చేస్తున్నపుడు.. న్యాయమూర్తులు అదే నియమాలు పాటించాలని.. అలా లేకపోవడంపై ధన్‌ఖడ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో పారదర్శకత అవసరమని అన్నారు. ఇటీవల హైకోర్టు జడ్జి అధికార నివాసంలో దొరికిన నోట్ల కట్టల కేసులో.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై స్పందించిన జగదీప్ ధన్‌ఖడ్.. నేర న్యాయవ్యవస్థ సామాన్యులకేనా అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌కే అధికారాలుభారత రాజ్యాంగంలో పార్లమెంట్ కంటే ఉన్నతమైన అధికారం ఏదీ లేదని.. పార్లమెంట్ సర్వోన్నతమైందని జగదీప్ ధన్‌ఖడ్ పదే పదే స్పష్టం చేశారు. రాజ్యాంగ విషయాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులే.. అంతిమ నిర్ణేతలు అని ఆయన వాదించారు. చట్టాలను న్యాయవ్యవస్థ రద్దు చేసినప్పుడు.. కొన్ని చర్యలను కార్యనిర్వాహక వ్యవస్థ రద్దు చేసినప్పుడు.. అవి తమ పరిధిని దాటుతున్నాయని ధన్‌ఖడ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.జాతీయ న్యాయ నియామకాల కమిషన్2015లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం ప్రజల సార్వభౌమాధికారానికి సవాలు అని జగదీప్ ధన్‌ఖడ్ అభివర్ణించారు. పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక చట్టాన్ని న్యాయవ్యవస్థ ఎలా రద్దు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌గా, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహరించిన తీరు.. తీవ్ర వివాదాస్పదం అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో రాజ్యాంగ సంస్థల మధ్య అధికారాల విభజనపై తన దృఢమైన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు.. న్యాయవాదులకు, రాజ్యాంగ నిపుణులకు మధ్య తీవ్ర చర్చలకు దారితీశాయి.