కూరగాయల విక్రేతకు రూ.29 లక్షల పన్ను నోటీసు.. UPI ఎంతపని చేసింది?

Wait 5 sec.

: చిన్న దుకాణంలో కూరగాయలు విక్రయిస్తే పన్ను నోటీసులు వస్తాయని మీలో ఎరైనా ఊహిస్తారా? అవునండీ ఇది జరిగింది. కర్ణాటకలో ఓ కూరగాయల విక్రేతకు ఏకంగా రూ.29 లక్షల పన్ను నోటీసు ఇచ్చారు అధికారులు. అంత పెద్ద మొత్తం పన్ను నేనెలా కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఆ చిరు వ్యాపారి చేసిన లావాదేవీలు ఏంటి? ఎందుకు పన్ను నోటీసులు అందుకోవాల్సి వచ్చింది? అనే వివరాలు కూరగాయలు విక్రయించడం సహా చిరు వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలోని హవేరికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి స్థానిక మున్సిపల్ హైస్కూల్ సమీపంలో చిన్న దుకాణం పెట్టుకుని కూరగాయలు విక్రయిస్తున్నాడు. రైతుల నుంచి నేరుగా కూరగాయలు తెచ్చుకుని అమ్ముతుంటాడు. గత నాలుగేళ్లుగా అక్కడే కురగాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అక్కడికి వచ్చే కస్టమర్లలో చాలా మంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా లేదా ఇతర డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. అదే ఇప్పుడు శంకర్ గౌడకు పెద్ద సమస్య తెచ్చి పెట్టింది. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా రూ.1.63 కోట్ల ట్రాన్సాక్షన్లు చేశావంటూ జీఎస్‌టీ అధికారులు అతనికి పన్ను నోటీసు పంపారు. రూ.29 లక్షల జీఎస్‌టీ కట్టాల్సి ఉందని తెలిపారు. అయితే, ఈ చూసి ఒక్కసారిగా షాక్‌కి గురికావాల్సి వచ్చిందని కూరగాయల విక్రేత శంకర్ గౌడ తెలిపారు. తాను రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొని తన చిన్న దుకాణంలో విక్రయిస్తానంటూ చెప్పాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లు ఎక్కువగా యూపీఐ చెల్లింపులు చేస్తారని చెప్పాడు. అయితే, తాను ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ఫైల్ చేస్తానని, అందుకు సంబంధించిన అన్ని రికార్డులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కూరగాయలకు జీఎస్టీ లేదుజీఎస్‌టీ నిబంధనల ప్రకారం.. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన కూరగాయలను ఎలాంటి ప్రాసెస్ చేయకుండా, ప్యాకింగ్ చేయకుండా విక్రయిస్తే వాటిపై ఎలాంటి జీఎస్‌టీ ఉండదు. కూరగాయలను ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రం 5 శాతం జీఎస్‌టీ కట్టాల్సి వస్తుంది. అయితే, కర్ణాటక కూరగాయల విక్రేత శంకర్ గౌడ్ కేసు తర్వాత చాలా మంది చిన్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులను పక్కన పెట్టేస్తున్నారు. అంతా నగదుకు మారిపోతున్నారు. ఇప్పుడు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లోని దుకాణాల్లో యూపీఐ లేదు నగదు మాత్రమే అనే బోర్డులు కనిపిస్తుండడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు.. డిజిటల్ చెల్లింపులు అంగీకరించకుండా లావాదేవీలు దాచి పెట్టాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎస్‌టీ అధికారులు హెచ్చరికలు చేశారు. జూలై 12వ తేదీన జీఎస్‌టీ పరిమితికి మించి మొత్తంలో టర్నోవర్ చేసిన వ్యాపారులకు నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే చాలా మంది చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలకు జీఎస్‌టీ నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది.