ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి.. వివస్త్రుడ్ని చేసి, దారుణంగా హింసించి

Wait 5 sec.

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడికి గురయ్యాడు. 40 ఏళ్ల భారతీయుడిపై దాడికి పాల్పడిన దుండుగులు.. వివస్త్రుడ్ని చేసి హించించారు. డబ్లిన్‌లోని టలాట్‌లో శనివారం (జులై 19)న జరిగిన ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతడి ఛాతీ, చేతులు, కాళ్ళకు గాయాలై తీవ్ర రక్తస్రావం అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడిలో గాయపడిన బాధితుడ్ని తల్లాఘట్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై ఐరిష్ నేషనల్ పోలీసులు కేసు నమోదుచేసి.. దర్యాప్తు ప్రారంభించారు.ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా ఈ ఘటనను ఖండిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు., ‘రక్తస్రావం అయ్యేలా ఇంతటి దారుణమైన, భయంకరమైన దాడికి ఎందుకు పాల్పడ్డారు?’ అని ప్రశ్నించారు. బాధితుడికి అండగా నిలిచిన ఐరిష్ ప్రజలు, పోలీసుల చర్యలకు ధన్యవాదాలు తెలిపారు నిందితులను న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.కాగా, స్థానిక కౌన్సిలర్ బేబీ పెరెప్పాడన్ బాధితుడిని కలిసి సంఘీభావం తెలిపారు. అతను షాక్‌లో ఉన్నాడని, అందుకే ఎక్కువగా మాట్లాడలేకపోయాడని చెప్పారు. అంతేకాదు, మూడు వారాల కిందటే ఐర్లాండ్‌కు వచ్చినట్టు తెలిపాడని, ప్రస్తుతం అతడు ఎవరినీ కలిసే పరిస్థితిలో లేడన్నారు. టలాట్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఈ ప్రాంతంలో పోలీసులు భద్రత పెంచాలని ఆయన కోరారు.‘‘ఐర్లాండ్‌కు వచ్చే చాలామంది భారతీయులు వర్క్ పర్మిట్‌లు, ఆరోగ్య సంరక్షణ రంగంలో లేదా ఐటీ మొదలైన వాటిలో అధ్యయనం, ఉద్యోగాల కోసం వస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలి.. వారు కీలక నైపుణ్యాలు, సేవలను మనకు అందిస్తున్నారు’’ అని చెప్పారు.డబ్లిన్ సౌత్-వెస్ట్ నేత సీన్ పెయిన్ ఘాటుగా స్పందించారు. దీనిని హింసాత్మక, జాత్యహంకార దాడిగా అభివర్ణించారు. ‘తీవ్ర దుర్మార్గమైనది.. ఆమోదయోగ్యం కాదు" అని అన్నారు. ‘‘ఈ విధమైన మతిలేని, జాత్యహంకార హింస సమాజాన్ని సురక్షితంగా చేస్తుందని భావించడం తమను తాము మోసం చేసుకోవడమే.. ఈ రకమైన హింసాత్మక ఘటనలతో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు’’ అని అన్నారు. కాగా, దాడిచేసిన నిందితులు.. భారతీయుడు తమ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించగా.. అందులో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు.కాగా, ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి జిమ్ ఓ'కాలగన్.. వలసదారులపై తప్పుడు ఆరోపణలు పెరుగుతున్నాయని తెలిపారు. ‘‘నేరాలలో వలసదారుల ప్రమేయం ఉందనే ఆరోపణలకు ఆధారం లేదు. జైలు ఖైదీల్లో వలసదారుల శాతం, సమాజంలోని వలసదారుల శాతం కంటే తక్కువ’ అని వెల్లడించారు.