ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త మండలం ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై.రామవరం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలని చూస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హామీ ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.. ఇప్పుడు మళ్లీ ఆ ఫైలును ప్రభుత్వం బయటకు తీసింది.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండల కేంద్రానికి చేరుకోవాలంటే గిరిజనులు చాలా కష్టాలు పడేవారు. జిల్లాల విభజన జరగకముందు.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017 జూన్ 8న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో స్థానికులు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వివరించారు. వెంటనే స్పందించి చంద్రబాబు.. ఈ మండలాన్ని విభజిస్తామని.. మరో కొత్త మండలం ఏర్పాటు చేస్తామని స్వయంగా హామీ ఇచ్చారు. ఈ మేరకు అనంతరం ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి.. కానీ ఆ తర్వాత ప్రక్రియ మాత్రం జరగలేదు. గత ప్రభుత్వ హాయాంలో ఈ కొత్త మండలం అంశాన్ని పట్టించుకోలేదు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలో.. ఈ కొత్త మండలం ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ వెంటనే సంబంధిత అధికారులు మండల విభజన ఫైలును బయటకు తీశారు. అందుకు తగిన విధంగా వై రామవరం అప్పర్‌ను మండల కేంద్రంగా కొనసాగించాలని ప్రతిపాదించారు. ఈ మండలంలో ఆరు పంచాయతీలు ఉండేలా చూస్తున్నారు. అలాగే వై.రామవరం లోయర్‌కు గుర్తేడును మండల కేంద్రంగా చేయాలని భావిస్తున్నారు. దీని పరిధిలో 11 పంచాయతీలు ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి అప్పటి సబ్ కలెక్టర్ కొన్ని సూచనలు చేశారు. త్వరలోనే కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి.. ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఏపీలో ఒకటి, ఏర్పాటుతో పాటుగా మరికొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి.