భార్యా బాధితుడి ఆవేదన.. భరణం కోసం దొంగతనాలు.. కన్నీరు తెప్పిస్తున్న 'భర్త' కథ

Wait 5 sec.

చట్టం ఇచ్చిన తీర్పును పాటించేందుకు.. ఓ వ్యక్తి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విడాకుల సందర్భంగా భార్యకు చెల్లించాలని కోర్టు తీర్పునివ్వడంతో.. ఆ భరణం డబ్బులు చెల్లించేందుకు ఓ భర్త దొంగగా మారిపోయాడు. ఈ క్రమంలోనే చైన్ స్నాచింగ్ చేస్తూ.. పోలీసులకు పట్టుబడ్డాడు. అసలు దొంగతనం ఎందుకు చేశావంటూ పోలీసులు ప్రశ్నించగా.. ఆ దొంగ చెప్పిన సమాధానం విని.. వాళ్లే అవాక్కయ్యారు. తనకు ఉద్యోగం లేదని, పని కూడా లేదని.. నెల నెలా భరణం డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్నానంటూ తన గోడు వెళ్లబోసుకున్న ఆ దొంగ.. వాటి నుంచి బయటపడేందుకు ఇలా దొంగతనాలు చేస్తున్నానని చెప్పడం గమనార్హం. ప్రస్తుత సమాజంలో భార్యల వేధింపులు తట్టుకోలేక, వాటిని బయటికి చెప్పుకోలేక భర్తలు.. ఆ బాధలను మింగలేక, కక్కలేక చిత్రవధకు గురవుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం.. సమాజం ఆలోచించేలా చేస్తోంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన కన్నయ్య నారాయణ్ బౌరాషి అనే భార్యా బాధితుడి కథే ఇది. మన్కపూర్‌లోని గణపతి నగర్‌కు చెందిన 42 ఏళ్ల కన్నయ్య నారాయణ్‌కు భార్యతో గొడవల కారణంగా కోర్టు గతంలో విడాకులు మంజూరు చేసింది. అయితే నెలకు రూ.6 వేల భరణం భార్యకు చెల్లించాలని కన్నయ్యను కోర్టు ఆదేశించింది. అయితే నిరుద్యోగి అయిన కన్నయ్య.. భరణం చెల్లించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొన్ని నెలలుగా చైన్ స్నాచింగ్‌లు చేస్తూ.. డబ్బులు సంపాదించాడు. వృద్ధురాలి ఫిర్యాదుతో అరెస్ట్ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం మనీష్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 74 ఏళ్ల వృద్ధురాలు జయశ్రీ జయకుమార్ గాడే మెడలో ఉన్న బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఒక దొంగ లాక్కెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు బెల్టరోడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా చైన్ స్నాచింగ్ చేసింది కన్నయ్య నారాయణ్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. వృత్తిగా మారిన చైన్ స్నాచింగ్గత కొన్ని నెలలుగా ఇలాగే చైన్ స్నాచింగ్ చేసి డబ్బులు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవలి కాలంలో 4 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు కన్నయ్య నారాయణ్ అంగీకరించాడు. దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని గోధాని రోడ్డులోని శ్రీ సాయి జ్యువెలర్స్‌లో అమ్మినట్లు గుర్తించిన పోలీసులు.. దాని ఓనర్ అమర్‌దీప్ కృష్ణారావు నాఖతేను కూడా అరెస్ట్ చేశారు. బంగారం, నగదు స్వాధీనంఈ క్రమంలోనే నిందితుడు కన్నయ్య నారాయణ్ నుంచి రూ. 1.85 లక్షల విలువైన 10.94 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరాలకు ఉపయోగించిన బైక్, అతడి సెల్‌ఫోన్‌ను కూడా సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు. ఇవేకాకుండా మరిన్ని కేసుల్లోనూ కన్నయ్య ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య పోరు పడలేక కన్నయ్య ఆమెను వదిలించుకున్నా.. విడాకుల బాధ మాత్రం అతడికి తగ్గలేదు. చట్టం ప్రకారం భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ దొంగతనాలను ఆశ్రయించినట్లు చెప్పాడు. తనకు వచ్చిన కష్టాన్ని ఎవరికీ చెప్పలేకపోయాడు. ఒకవైపు ఉద్యోగం లేక.. మరోవైపు భరణం చెల్లించడం కోసం విధిలేని పరిస్థితుల్లో దొంగతనమే శరణ్యమని ఆ ఊబిలోకి దూకేశాడు. ఇక రోడ్లపై వెళ్లేవారి మెడలో ఉన్న గొలుసులు కొట్టేసి.. వాటిని ఎంతో కొంతకు అమ్మేసి.. వచ్చిన డబ్బును భార్యకు భరణం రూపంలో నెల నెలా చెల్లిస్తూ వచ్చాడు. అయితే చేసిన తప్పు ఎన్నడో ఒక రోజు బయటపడక తప్పదన్నట్లు.. చైన్ స్నాచింగ్ చేస్తుండగా.. పోలీసులకు చిక్కాడు. నేరం వెనుక ఆలోచించాల్సిన కారణంనేరం చేయడం తప్పే అయినా.. దానికి దారితీసిన కారణాలు కూడా ఆలోచనలో పడేశాయి. భార్యతో విడాకులై.. ఏ పనీ లేక నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి.. నెల నెలా భరణం ఎలా చెల్లిస్తాడు అనేది ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఒకవైపు భార్య లేక మానసిక ఒత్తిడిలో ఉన్న ఆ వ్యక్తి.. ఇంకోవైపు ఉద్యోగం లేక ఆర్థికంగా చితికిపోయి ఉంటే.. అలాంటి పరిస్థితుల్లో భార్యకు నెల నెలా భరణం ఇవ్వాలి అనడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు వినిపిస్తున్నాయి. నేరం చేయడం తప్పే అయినా.. దానికి దారితీసిన కారణాలు కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.