అమ్మతనానికి ఆదర్శంగా జ్వాలా గుత్తా.. 30 లీటర్ల చనుబాలు దానం!

Wait 5 sec.

బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా అమ్మతనం ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు అందిస్తున్నారు. నిజంగా నువ్వు రియల్ ఛాంపియన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసలు ఆమెను ఎందుకని ఇలా పొగుడుతున్నారంటే.. తన తల్లిపాలను దానం చేసేందుకు ముందుకు రావడమే కాకుండా, 30 లీటర్ల చనుబాలు దానం చేసింది. తల్లిపాలకు నోచుకోకుండా అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందుతున్న ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను నిలబెట్టింది. భారత బ్యాడ్మింటన్ స్టార్‌గా జ్వాలా గుత్తా అందరికీ పరిచయమే. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో దేశానికి పతకాల పంట పండించిన జ్వాలా.. ఆ తర్వాత సినిమా రంగంలోనూ అడుగుపెట్టింది. టాలీవుడ్ మూవీ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఎంట్రీ కూడా ఇచ్చింది. సినిమాలతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లోనూ తన పాత్రను పంచుకుంది. ఈ సమయంలోనే 2021లో తమిళ నటుడు విష్ణు విశాల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. విష్ణు విశాల్ - జ్వాలా గుత్తా దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్‌లో మిరా అనే పాప కూడా జన్మించింది. ఈ క్రమంలోనే జ్వాలా తన మంచి మనస్సునూ చాటుకుంది. తన పాపకు పాలు పడుతూనే.. మిగిలిన పాలను ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువలకు, చనుబాలకు నోచుకోని పిల్లలకు అందిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 30 లీటర్ల తల్లిపాలు దానం చేశానని ఆమె తెలిపింది. కొత్తగా తల్లులైన ఎందరో మహిళలకు ఇది ఒక బాధ్యత కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. "తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానం. అనారోగ్యాలకు గురైన పసి పిల్లలు, తల్లిపాలకు నోచుకోని చిన్నారులకు ఈ పాలు కడుపు నింపుతాయి. వాళ్ల అనారోగ్యాలను దూరం చేసి ప్రాణాలు కూడా కాపాడుతాయి. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్‌కి సపోర్ట్ చేసి.. వీలైన వాళ్లు చనుబాలు దానం చేయండి. ప్రస్తుతం నేనూ అదే పనిలో ఉన్నా" అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఐవీఎఫ్ పద్ధతిలో పాపకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని నేరుగా ఆమే వెల్లడించింది. 'పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. అవి అన్నీ విఫలమయ్యాయి. ఇక ఆశలు వదిలేసుకున్న సమయంలో హీరో ఆమిర్ ఖాన్ సలహా ఇచ్చారు. ఆ తర్వాత ముంబైకి వెళ్లి చికిత్స తీసుకున్నాం. అక్కడే ఐపీఎఫ్ ద్వారా మా కల నెరవేరింది'