గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు.. మరోసారి దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. అధికార ప్రతిపక్షాలు.. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని పర్యావరణానికి, అక్కడున్న ప్రత్యేక తెగలకు ప్రమాదకరంగా అభివర్ణిస్తున్నాయి. అధికార పక్షం మాత్రం వ్యూహాత్మకంగా కీలకంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో అసలు ఏంటి? దీనిపై మళ్లీ ఎందుకు చర్చ జరుగుతోంది? ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తుతున్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై.. మళ్లీ చర్చ ఎందుకు?ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికలో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై ఓ వ్యాసం రాశారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ. దీంతో ఈ ప్రాజెక్టు గురించి చర్చ ఊపందుకుంది. ఈ వ్యాసంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోనియా గాంధీ. అక్కడ నివసిస్తున్న నికోబారీస్, షోంపెన్ అనే ప్రత్యేక తెగలు ఇప్పటికే అంతరించి పోయే దశలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఆ తెగలు ఉన్న ప్రాంతాన్ని.. బయటి వ్యక్తులు ముంచెత్తుతారని అన్నారు. ఇది ఆ తెగల హక్కులను కాలరాయడమే అని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలు..ఈ ప్రాజెక్టు కారణంగా దాదాపు 8.5–18 లక్షల చెట్లు తొలగించాల్సి వస్తుందన్నారు సోనియా. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిశీనలో తప్పులు ఉన్నాయని.. తమకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేలా ప్రభుత్వం సైంటిస్టులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. అంతపెద్ద ప్రాజెక్టుకోసం అది అనువైన ప్రాంతం కాదని.. భూకంపాలు, సునామీలు వచ్చే డిజాస్టర్ జోన్‌లో ఉందని ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టును విధానపరమైన వైఫల్యంగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు. దీన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ వాదనేంటి..?వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టు భారత్‌కు చాలా ముఖ్యమని బీజేపీ నేత అనిల్ అంటోని అన్నారు. ఇండోనేసియాకు కేవలం 150 మైళ్ల దూరంలో ఉండే గ్రేట్ నికోబార్ దీవి.. చైనాకు అతి ముఖ్యమైన మలక్కా జలసంధికి చాలా దగ్గరలో ఉందన్నారు. భారత నావికాదళ శక్తికి ఇది కీలకంగా నిలుస్తుందన్నారు. వ్యూహాత్మకంగా, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలన్నా.. ఇది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 2012లో సోనియా గాంధీ యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో గ్రేట్ నికోబార్‌లోని క్యాంప్‌బెల్ బేలో ఐఎన్ఎస్ నావల్ స్టేషన్‌ ప్రారంభం అయిందని గుర్తు చేశారు. ఏంటీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు..?నికోబార్ ద్వీపాల్లో ఒకటే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్. దాదాపు 900 చదరపు కిలోమీటర్లు ఉండే ఈ దీవిలో రెండు నేషనల్ పార్కులతో పాటు షోంపెన్, ఓంగే, అండమానీస్, నికోబారీస్ అనే తెగలకు చెందిన ప్రజలు వందల సంఖ్యలో ఉన్నారు. ఈ దీవిని రూ.72,000 కోట్లతో అభివృద్ధి చేయడానికి 2021లో కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు'కు శ్రీకారం చుట్టింది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ANIIDCO) అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టులో భాంగా.. గ్రేట్ నికోబార్ ఐలాండ్‌లో ఒక ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్‌-షిప్‌మెంట్ టెర్మినల్ (ICTT), అంతర్జాతీయ విమానాశ్రయం, 450 MVA గ్యాస్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తారు. మూడు నుంచి నాలుగు లక్షల మంది నివాసం ఉండేలా మెగా టౌన్‌షిప్‌ను నిర్మిస్తారు. ICTTని ఎలాంటి జనసంచారం లేని, గ్రేట్ నికోబార్ దీవి కింది భాగంలో ఉన్న గలాథియా బేలో నిర్మిస్తారు. దీన్ని హాంగ్‌కాంగ్ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచించారు. ఇది శ్రీలంకలోని కొలంబో, మాలేషియాలోని పోర్టు క్లాంగ్‌కు సమాన దూరంలో ఉంటుంది. భారత్‌కు ఎందుకంత ముఖ్యం?ప్రపంచ సముద్ర రవాణాలో అత్యంత కీలకం మలక్కా జలసంధి. దీని ముఖద్వారంలో ఉన్న 6 డిగ్రీ ఛానెల్‌కు అతి సమీపంలో కూర్చుంది గ్రేట్ నికోబార్ దీవి. హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఈ మలక్కా జలసంధి ద్వారా.. 30-40 శాతం ప్రపంచ సముద్ర రవాణా జరుగుతుంది. చైనా పెట్రోలియం దిగుమతులు మలక్కా జలసంధి మీదుగానే ఎక్కువ (దాదాపు 80 శాతం) జరుగుతాయి. ఈ మార్గాన్ని భారత్ మూసివేస్తే.. చైనాకు చమురు కొరత ఏర్పడుతుంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెంచుకోవడానికి తహతహ లాడుతున్న నేపథ్యంలో.. ఈ ప్రాంతాలపై పట్టు సాధించడం భారత్‌కు అవసరం.మిలిటరీ పరంగా..ఇండోనేసియాలోని సుందా, లాంబోక్ జలసంధి సమీపాల్లో చైనా నావికాదళ స్థావరాలు నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అంతేకాకుండా స్ట్రింగ్ ఆప్ పెర్ల్స్ (String of Pearls) వ్యూహంలో భాగంగా.. భారత్‌కు తూర్పు దిక్కున శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును 99 ఏళ్లు లీజుకు తీసుకుంది చైనా. అలాగే బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ పోర్టు అభివృద్ధి చేస్తోంది. ఇక మయన్మార్‌లో క్యయుక్‌ప్యూ (Kyaukpyu) ప్రాంతంలో డీప్ సీ పోర్టును నిర్మిస్తోంది. దీంతోపాటు.. అండమాన్ నికోబార్, ద్వీపాలకు కేవలం 55 కిలోమీటర్లలోని కోకో ఐలాండ్స్‌లో మిలిటరీ స్థావరాన్ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్‌కు చాలా ప్రమాదకరం.ఈ క్రమంలో డ్రాగన్ ప్రయత్నాలకు చెక్ పెట్టడానికి.. గ్రేట్ నికోబార్‌ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. చైనా భారత్ చుట్టూ ఇన్ని పోర్టులు అభివృద్ధి చేసినా.. డ్రాగన్‌కు చెక్ పెట్టాలంటే.. నికోబార్ ఐలాండే కీలకం. ఇక్కడ భారత్ మిలిటరీ, నావల్, కోస్ట్‌గార్డ్ స్థావరాలు ఉంటే.. చైనా పీక నొక్కినట్టే అవుతుంది. అందుకోసమే.. వాణిజ్య అవసరాలకు, మిలిటరీకి అవసరమయ్యే విధంగా ఇక్కడ విమానాశ్రయం, పోర్టు నిర్మించాలని ప్రణాళిక వేశారు. చైనా వ్యూహానికి.. భారత్ ప్రతివ్యూహం నెక్లెస్ ఆఫ్ డైమండ్‌లో (Necklace of Diamonds) భాగంగా ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వాణిజ్య పరంగా..గ్రేట్ నికోబార్‌లో డీప్ సీ పోర్టు నిర్మిస్తే భారత్‌ వాణిజ్య పరంగా మరో ముందడుగు వేసినట్లు అవుతుంది. ఇక్కడ నిర్మించే పోర్టు ద్వారా పెద్ద కార్గో నౌకలను హ్యాండిల్ చేయొచ్చు. ప్రస్తుతం దీని కోసం మనం సింగపూర్, కొలంబో పోర్టులపై ఆధారపడుతున్నాం. ఈ పోర్టు నిర్మిస్తే ఇండోపసిఫిక్ ప్రాంతంలో సముద్ర రవాణాలో కీలక శక్తిగా భారత్ ఎదుగుతుంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు సవాళ్లివే..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. 8–18 లక్షల చెట్లను (అంచనా) నరికివేయడం వల్ల అక్కడ ఉన్న పగడపు దిబ్బలకు ముప్పు ఏర్పడుతుంది. తాబేళ్ల గూళ్ల ప్రదేశాలు, నికోబార్ దీవి ప్రత్యేక జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ప్రపంచంలో అత్యంత దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్న షోంపెన్, నికోబారీ తెగలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ద్వీపం భూకంపం, సునామీలు ఏర్పడే జోన్‌లో ఉంది. 2004 వచ్చిన హిందూ మహాసముద్ర సునామీతో ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది.2027-28 నాటికి 18,000 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ మేరకు అన్ని విషయాలు పరిశీలించి 2025 జులైలో హై-పవర్ కమిటీ (HPC) ఇచ్చిన రిపోర్టును నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు (NGT) సమర్పించింది. ఎన్‌జీటీ ఏమైనా అభ్యంతరాలు చెబితే మళ్లీ డీపీఆర్‌లను సవరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓకే చెబితే.. పోర్టు, టౌన్‌షిప్‌నకు గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది. అయితే ప్రతి దశలో జరిగే పనులను ఎకోలజీ, ట్రైబల్, కాలుష్య కమిటీలు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తాయి. చైనాకు చెక్ పెట్టాలంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చాలా ముఖ్యం. ఇక్కడి నంచి హిందూ మహాసముద్రంపై ఓ కన్నేసి ఉంచొచ్చు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం చలాయించాలనుకుంటున్న డ్రాగన్‌కు బుద్ధి చెప్పొచ్చు. ఇది కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు.. భారత్‌కు ఉన్న భౌగోళిక అడ్వాంటేజ్‌ను వ్యూహంగా మార్చుకోవడం. ఆ వ్యూహంతో భారత్‌ను అజేయ శక్తిగా తీర్చిదిద్దడం. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను విస్మరించలేం. ఎంత కాదనుకున్నా.. ఈ స్థాయి ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. అయినా ప్రతిపక్షాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ తన నిర్ణయంపై కేంద్రం ముందుకు వెళ్లాలనుకుంటే.. పర్యావరణ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. జాతీయ భద్రత విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే.. ఆదివాసీల హక్కుల గురించి ఆందోళనలను పరిగణలోకి తీసుకుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరిగుతుందో వేచి చూడాలి.