తెలంగాణ సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేకమైన, శుభకరమైన రోజుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయాణాలను దానం చేసే సదుపాయం ఈ కార్యక్రమం ద్వారా కల్పించబడుతుంది. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.వ్యక్తులు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు లేదా ఇతర శుభకార్యాల సందర్భంగా అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు లేదా పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రకు తీసుకెళ్లవచ్చు. దీని కోసం వారు సంస్థకు తగిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలి. ఈ విరాళాలను స్పాన్సర్ చేసేవారికి టీజీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని కల్పిస్తుంది. వ్యక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్లు, ఎన్జీవోలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.యాత్రాదానం కార్యక్రమం నిర్వహణ కోసం ఏర్పాటు చేసింది. దాతలు చెల్లించే విరాళానికి అనుగుణంగా.. కిలోమీటర్ల ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ లేదా ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తారు. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కవర్ చేసే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా సంస్థ రూపొందించింది.ఆసక్తి ఉన్న దాతలు స్థానిక ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించి బస్సులను బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టీసీ హెల్ప్ లైన్ నంబర్లు 040 69440000 లేదా 040 23450033 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ప్రజలకు రవాణా సేవలతో పాటు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. భారతదేశంలోనే ఇలాంటి కార్యక్రమం మొదటిసారిగా చేపడుతున్నామని, ఇది కేవలం సామాజిక సేవ మాత్రమే కాదని, సాంస్కృతిక విలువలను పెంపొందించే మానవత్వపు బహుమతి అని అన్నారు. అనాథలు, వృద్ధులను విహారయాత్రలకు తీసుకెళ్లడం ద్వారా వారికి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ.. మంత్రి పొన్నం ప్రభాకర్, సజ్జనర్ గారు చెరో లక్ష రూపాయల విరాళాన్ని యాత్రాదానం నిధికి ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కులను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.