: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు ప్రారంభించిన సంస్థకు.. సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇప్పటివరకు వంతారా సంస్థకు ఆలయాల ఏనుగులను తరలించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. కీలక ఉత్తర్వులు వెలువరించింది. రూల్స్‌ను పాటిస్తూ.. వంతారా సంస్థకు ఏనుగులను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గుజరాత్‌ జామ్‌నగర్‌లోని వంతారాకు సంబంధించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగులను తరలించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ విచారణ సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి.. దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కూడా వంతారా సంస్థకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్‌ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వంతారా సంస్థపై సిట్ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాత.. ఈ మొత్తం వ్యవహారంపై సంపూర్ణంగా ఉత్తర్వులు వెలువరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వంతారా సంస్థలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి ఓనర్లకు తిరిగి ఇవ్వడానికి ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సీ.ఆర్. జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ సరిగా లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దాన్ని కొట్టివేసింది. వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో వన్యప్రాణుల చట్టాలను పాటించడం లేదని.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సంచలన ఆరోపణలు చేశాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిల్‌ కూడా దాఖలు చేశాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. జంతువులపై వేటను చట్టబద్ధం చేసిన దేశాలు.. భారత్‌ చేస్తున్న మంచి పనులపై అభ్యంతరాలను లేవనెత్తుతున్నాయని.. వంతారా సంస్థ తరఫు వాదనలు వినిపించిన లాయర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సిట్ చేసే దర్యాప్తుకు తాము అన్నిరకాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు.