కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో జరిగిన తాజా పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల పంపిణీపై పెద్ద చర్చకు దారితీశాయి. అక్కడ నమోదైన 1116 మంది పింఛనుదారుల్లో 116 మందిపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. విజిలెన్స్‌ విభాగం సమీక్ష అనంతరం.. 41 మందిని , వారి పింఛన్లు రద్దు చేశారు. మిగిలిన 75 మంది కేసులు వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన కేవలం ఒక మండలానికే పరిమితం కాలేదు. దివ్యాంగుల కేటగిరీలోనే కాకుండా.. ఆర్థికంగా బలమైన వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు కూడా పింఛన్లను అక్రమంగా పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంటే.. ఈ సమస్య ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా అనర్హులకు పింఛన్లు వచ్చే విధంగా చేసిన వారిని అధికారులు ఇంకా గుర్తించలేదు. ఇల్లందకుంటలో గుర్తించిన 41 మంది అనర్హులు ఐదు సంవత్సరాల్లోనే ప్రభుత్వానికి రూ.1 కోటి వరకు నష్టం కలిగించారు. దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలో జరిగిన శిబిరాల్లో కొంతమంది డబ్బుల కోసం తప్పుడు ధ్రువపత్రాలు మంజూరు చేసినట్లు బయటపడింది. దీనివల్ల ఒక డాక్టర్‌ను సేవల నుండి తొలగించిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఇప్పుడు అయితే కొత్త నియమావళి ప్రకారం పింఛన్ల మంజూరు అనేది కఠినంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారు బయటపడుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం లబ్ధిదారులలో వృద్ధులు 55,232 మంది, దివ్యాంగులు 23,172 మంది, వితంతువులు 37,636 మంది, ఇతరులు 22,337 మంది ఉన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. దివ్యాంగుల విభాగంలో కనీసం 10 శాతం వరకు అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజాధనం వృథా కాకుండా కాపాడాలంటే.. . సామాజిక పింఛన్లపై ‘ఉపాధి హామీ’ తరహా సమీక్షా కార్యక్రమం చేపడితే.. అక్రమ లబ్ధిదారులను బయట పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు నిజంగా అర్హులైన వారు ఇంకా పింఛన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. స్థానిక ప్రతినిధులు రాజకీయ లెక్కలతో నిశ్శబ్దంగా ఉన్నా.. యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది.