విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈనెల 15 నుంచి కాలేజీలు బంద్

Wait 5 sec.

తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా బంద్‌ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్‌ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా, నర్సింగ్‌ కాలేజీలు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు ఫెడరేషన్‌ నేతలు వెల్లడించారు. గత కొంత కాలంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ పేర్కొంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో.. తమ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృత్తి విద్యా కాలేజీలను ఈనెల 15వ తేదీ నుంచి బంద్ చేస్తున్నట్లు.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు ఇప్పటికే వినతిపత్రం అందించినట్లు ఫెడరేషన్ సభ్యులు స్పష్టం చేశారు. ఈ బంద్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వృత్తి విద్యా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వృత్తి విద్యా కాలేజీలకు, వాటిలో చదివే విద్యార్థులకు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ కలిపి మొత్తంగా రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వెంటనే ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే తెలంగాణ విద్యా రంగం తీవ్రంగా దెబ్బతింటుందని.. కళాశాలల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొన్నారు. మరోవైపు.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని.. గత కొంతకాలంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్ వెంట‌నే రిలీజ్ చేయాల‌ని ఇప్పటికే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని.. అయితే వాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించ‌క‌పోవ‌డంతోనే నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేయ‌నందుకు నిర‌స‌న‌గా సెప్టెంబర్ 15వ తేదీ ఇంజినీర్స్ డేను బ్లాక్‌డేగా పాటిస్తామ‌ని ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాలు ప్రక‌టించాయి.