IND vs PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. కెప్టెన్ సూర్యకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..!

Wait 5 sec.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు లేకపోయినా యువ భారత్.. పాకిస్థాన్‌పై అదరగొట్టింది. ఆసియాకప్‌ 2025లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దాయాది దేశాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో సత్తాచాటిన .. ఆపై బ్యాటింగ్‌లోనూ అదే పునరావృతం చేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని మరో 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.షేక్ చేసిన అభిషేక్..128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు.. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు ఎదురుదాడికి దిగిన ఈ ప్లేయర్.. 13 బంతుల్లో 31 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 2 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (7 బంతుల్లో 10 రన్స్‌) త్వరగానే ఔట్ అయ్యాడు. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్‌..గిల్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. రన్ ఛేజ్‌కు తగ్గట్లుగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. గతంలో పాకిస్థాన్‌పై పెద్దగా రాణించలేకపోయిన ఈ ప్లేయర్.. ఈసారి మాత్రం పట్టుదలతో ఆడాడు. చివరి వరకు క్రీజులో ఉండి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. తిలక్ వర్మ (31 బంతుల్లో 31 రన్స్‌), శివమ్ దూబె (7 బంతుల్లో 10 రన్స్ నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. దీంతో 15.5 ఓవర్లలోనే భారత్.. మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బౌలర్లలో సయీమ్ ఆయూబ్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. భారత బౌలర్ల దెబ్బకు 127/9కే పరిమితమైంది. ఫర్హారీ (40), షహీన్ అఫ్రిదీ (33) రాణించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, బుమ్రా 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. ఇక తొలి మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసి.. తాజాగా పాక్‌ను మట్టికరిపించిన భారత్.. ఆసియాకప్ సూపర్‌-4లోకి ప్రవేశించింది. భారత బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ బ్యాటర్లు వణికిపోయారు. తొలి ఓవర్ మొదటి బంతికే సైమ్ అయూబ్ వికెట్ పడగొట్టిన హార్దిక్ పాండ్య భారత్‌కు శుభారంభం ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో బుమ్రా.. మహ్మద్ హారిస్‌ను ఔట్ చేశాడు. తర్వాత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కలిపి ఐదు వికెట్లు తీయడంతో పాక్ కోలుకోలేకపోయింది. ఓ దశలో 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ చివర్లో షాహీన్ అఫ్రిదీ (16 బంతుల్లో 33 నాటౌట్) వేగంగా ఆడటంతో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.