ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీలో ఆ పిల్లలందరికి తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మిషన్ వాత్సల్య పథకం ఆసరాగా నిలిచింది. కేంద్రం పిల్లల చదువుకు, పోషణకు డబ్బు సహాయం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే మొదటి విడతలో 24,000 రూపాయలు, రెండో విడతలో అదనంగా 6,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేసుకోవచ్చు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది.అర్హులైనవారు వెంటనే సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, సీడీపీవోను కూడా సంప్రదించి.. అవసరమైన పత్రాలు అందించాలి. ఈ మేరకు దరఖాస్తు చేసేందుకు పిల్లల జనన, ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్‌కార్డు కాపీలు, బ్యాంక్‌ పాస్‌ బుక్, మిగిలిన పత్రాలు అందజేయాలి. అయితే ఈ డాక్యుమెంట్‌లపై కచ్చితంగా గెజిటెడ్‌ అధికారి సంతకం ఉండాలి. అర్హుల ఎంపికలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. మిషన్ వాత్సల్య కింద ఎంపికైన వారికి నెలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఇప్పటికే ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా మూడో విడత కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఫైనల్ జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి.. తల్లిదండ్రులను కోల్పోయినవారు.. 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి. వీరితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దంపతుల పిల్లలు కూడా అర్హులు. అలాగే బాలల న్యాయ చట్టం- 2015 ప్రకారం నిరాదరణకు గురైనవారు కూడా అర్హులే. కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72వేలు ఉండాలి. అదే పట్టణాల్లో అయితే రూ. 96వేలు మించనివారు అర్హులు. అయితే ఈ డబ్బుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం ఇస్తుంది.