ఘట్టమనేని అల్లుడుగా, మహేష్ బాబు బావగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు సుధీర్ బాబు. 'ఏమాయ చేశావే' సినిమాలో సపోర్టింగ్ రోల్ తో కెరీర్ ప్రారంభించి, 'SMS - శివ మనసులో శృతి' అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. 'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని', 'భలే మంచి రోజు', 'సమ్మోహనం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. హిట్ టాక్ తెచ్చుకున్న మూవీస్ సైతం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయారు. ఈసారి తప్పకుండా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో 'జటాధర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'జటాధర'. ఇదొక సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఇతర పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. 'జటాధర' సినిమాని 2025 నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మామూలుగా సినీ ఇండస్ట్రీలో నవంబర్ నెలను డ్రై సీజన్ గా భావిస్తుంటారు. దసరా, దీపావళి పండగలకు సినిమాలు చేసేసిన జనాలు.. థియేటర్లలకు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరని భావిస్తారు. అందుకే పెద్ద సినిమాలను ఆ నెలలో రిలీజ్ చేయడానికి వెనకడుతుంటారు. అయితే ఇప్పుడు సుధీర్ బాబు చిత్రాన్ని అదే సీజన్ లో విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం సెంటిమెంట్స్ బ్రేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.