'భోళా శంకర్' లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. నిజానికి మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఆరు సినిమాలు పడ్డాయి. ఇందులో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు బాస్‌కి సక్సెస్ ఇచ్చాయి కానీ ఫ్యాన్స్‌కి మాత్రం ఆకలి తీర్చలేదు. మరి గతేడాది వెంకీకి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ ఏడాది మెగాస్టార్‌కి కూడా అదే ఫీట్ రిపీట్ చేశారా? అలాంటి పక్కా పండగ బొమ్మ దింపారా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కావాల్సింది కథ కాదోయ్ఏదైనా సినిమా హిట్ ఆర్ ఫ్లాప్‌ అని డిసైడ్ చేసే మెయిన్ పాయింట్లలో 'కథ, కథనం' రెండూ చాలా ముఖ్యమైనవి. అందులోనూ కథ సినిమాకి ఎప్పుడూ ప్రాణం. అయితే అనిల్ రావిపూడి సినిమాల్లో కథ, కథలో లాజిక్స్ కంటే స్క్రీన్‌ప్లే, అంతకుమించిన ఓ మ్యాజిక్ ఉంటుంది. ఇది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయన తీసిన ఏ సినిమా చూసినా కథలో పెద్దగా ఫ్రిక్షన్, మలుపులు అలాంటివేం ఉండవ్. కానీ ఆడియన్స్‌ని థియేటర్లకి రంపించే మ్యాజిక్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 'మన శంకరవరప్రసాద్ గారు'తో అదే రిపీట్ చేశారు అనిల్.ఈ సినిమా కథేంటి అంటే రెండే ముక్కల్లో చెప్పేయొచ్చు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకరవరప్రసాద్ (చిరంజీవి).. మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ (నయనతార)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు.. ఇక అదే ఇష్టం ఆమెకి కూడా కలగడంతో టపీటపీమని మూడు ముళ్లూ పడిపోతాయి. ఒక డ్యూయెట్ పడేలోపు ఇద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు. అయితే తన ఆస్తి, ఐశ్వర్యం అన్నీ వదిలేసి ప్రసాద్‌తో తన కూతురు వెళ్లిపోయిందనే కోపంతో శశిరేఖ తండ్రి జీవీకే (సచిన్ ఖేడేకర్) అల్లుడు-కూతుర్ని తన కుట్రలతో విడదీసి డైవర్స్ ఇప్పించేస్తాడు.అలా పిల్లలకి ఆరేళ్లపాటు దూరమైన మన ప్రసాద్.. వాళ్లకి ఎలా దగ్గరయ్యాడు.. తిరిగి తన శశిరేఖని ఎలా కలుసుకున్నాడు.. ఈ ఫ్యామిలీ కథ ఎలా సుఖాంతమైంది అనేదే మిగిలిన కథ. ఇక ఈ కథలో వెంకీ గౌడ (వెంకటేష్) పాత్ర ఏంటి..? శశిరేఖని, ఆమె పిల్లల్ని ఎవరు చంపాలనుకున్నారు? అనేది తెరపై చూడాల్సిందే.బాస్ ఈజ్ బ్యాక్.. స్టైల్, స్వాగ్ ఇండస్ట్రీని ఏలిన ఇంద్రుడు.. కనుసైగతో రికార్డుల్ని కొల్లగొట్టిన కొదమ సింహం.. సింపుల్‌గా చెప్పాలంటే మనందరి గ్యాంగ్ లీడర్‌ని స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ తనివితీరా విజిల్స్ వేసి చాలా కాలమే అయిపోయింది. ఆ కోరికని శంకరవరప్రసాద్ గారు ఖచ్చితంగా తీర్చారు. ముఖ్యంగా సినిమా మొదలైన ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు పడే వరకూ చిరంజీవి స్టైల్, స్వాగ్, ఎప్పీరియన్స్, లుక్స్ చూసి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక 10 సార్లు అయినా బాస్ ఈజ్ బ్యాక్ అనుకొని ఉంటారు.ఓవైపు కామెడీని మరోవైపు హీరోయిజాన్ని అవలీలగా మోస్తూ ఒకప్పడు మనం చూసిన అదే మెగాస్టార్‌లా.. వింటేజ్ చిరంజీవిలా బాస్ కనిపించారు. ముఖ్యంగా ఆయన ఇందులో పండించిన కామెడీ మాత్రం జై చిరంజీవ, అందరివాడు లాంటి సినిమాల్ని మరోసారి గుర్తుచేస్తాయి. రీఎంట్రీ తర్వాత చిరంజీవికి ఇది సాలిడ్ సినిమా అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఇక డ్యాన్స్ అంటే బాస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హుక్ స్టెప్ పాటలో చిరు వేసిన స్టెప్పులకి ఫ్యాన్స్ విజిల్స్ వేయడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో కూడా చిరు చాలా రోజుల తర్వాత తన మార్క్ చూపించారు. ఇక చిరుకి జోడీగా శశిరేఖ పాత్రలో నయనతార చూడటానికి చాలా అందంగా కనిపించారు. ఆమె ఈ సినిమాలో కనిపించినంత స్టైలిష్‌గా ఈ మధ్య కాలంలో అయితే ఏ మూవీలోనూ కనిపించలేదు. చీర కట్టినా, సూట్ వేసినా, మోడ్రన్ లుక్‌లో మెరిసినా ప్రతి చోటా నయన్ కూడా ఒకప్పటి గ్లామర్ క్వీన్‌లా మెరిశారు. తన పాత్రని అలా అలా ఈజ్‌తో ఈజీగా చేసుకుపోయారు. చిరు-నయన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది.వెంకీ రాకతో డబుల్ పండగఫస్టాఫ్ అంతా చిరు కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్స్‌, పిల్లలతో ఎమోషనల్ సీన్లతో అలా అలా సాగిపోయింది. కానీ సెకండాఫ్‌లో వెంకీ రాకతో థియేటర్లు దద్దరిల్లాయి. వెంకీ గౌడ పాత్రలో వెంకీ కనిపించిన తీరు, పండించిన కామెడీ.. ముఖ్యంగా మెగాస్టార్-వెంకటేష్ కాంబోలో పడిన ప్రతి సీన్ థియేటర్లో గట్టిగానే పేలింది. అందులోనూ ఒకరి హిట్ సాంగ్‌కి మరొకరు పోటాపోటీగా స్టెప్పులు వేసిన సీన్ అయితే ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.సినిమా మొత్తంలో వెంకటేష్ అనుకున్న దానికంటే ఎక్కువసేపే కనిపించారు. అలానే క్లైమాక్స్‌లో కూడా జైలర్ టెంప్లెట్‌ని అనిల్ రావిపూడి ఫాలో అయినట్లు అనిపించింది. మొత్తానికి అయితే కథ, కథనం సంగతి పక్కన పెడితే అనిల్ రావిపూడి మరోసారి తన ఫ్యామిలీ ఆడియన్స్‌కి తృప్తిగా తన స్టయిల్లో ఒక పండగ బొమ్మ అయితే దింపేశారు. ఇది అయితే పక్కా.పండగ ఫార్ములా ఇదిసంక్రాంతి వస్తున్నాం లాంటి చిత్రం తర్వాత రావిపూడి మరోసారి పండకి వస్తున్నారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకి వస్తున్నాం అన్నట్లుగా ముందే ఫిక్స్ అయిపోయారు. ఇక వారిని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా తన మార్క్ సినిమాని మరోసారి నీటిగా ప్రజెంట్ చేశారు అనిల్. ఎక్కడా హద్దులు దాటకుండా, తన బౌండరీలో ఉండే మరోసారి సిక్సర్ కొట్టారు.సినిమా మొత్తం వీలైనంత ఎక్కువసేపు చిరంజీవినే చూపిస్తూ ఎక్కడా ఫ్యాన్స్ నిరుత్సాపడకుండా చూసుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో బాస్ స్టయిల్, స్వాగ్‌ని.. కామెడీలో ఆయన టైమింగ్‌ని అనిల్ బాగా పట్టుకున్నాడు. చిరు సిగ్గుపడటం, మొహమాటపడటం, పంచులేయడం, తన మీద తానే జోకులేసుకోవడం ఇలా సీను ఏదైనా చూసిన ప్రతిసారి మెగాస్టార్‌ని ఇలా చూసి ఎన్నాళ్లయిందిరా అని ఆడియన్స్‌కి అనిపిస్తుంది. ఆ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా అనిల్ రావిపూడికే దక్కుతుంది.ఇక సినిమాలో మరో సర్‌ప్రైజింగ్ విషయం భీమ్స్ సిసిరోలియో. అవును.. భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ వినడానికే కాదు చూడటానికి కూడా స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించాయి.. వినిపించాయి. ఇక బీజీఎమ్ కూడా ఎక్కడ ఎంత కావాలో అక్కడ అంత చాలా పద్ధతిగా ఇచ్చాడు. ఇక కేథరిన్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్థన్, అభినవ్ గోమఠం, రఘుబాబు ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. చిరంజీవి-నయన్ పిల్లలుగా కనిపించిన ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు అలానే యాక్టింగ్ కూడా బాగా చేశారు. చిరు తల్లిగా చేసిన జరీనా వహాబ్ కూడా సెకండాఫ్‌లో ఒక సీనులో తన నటనతో మెప్పించారు. విజువల్స్ అన్నీ చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సహా మిగిలిన అన్నీ క్రాఫ్ట్స్‌తో అనిల్ వర్క్ చేయించిన తీరు స్క్రీన్ మీద బాగా తెలిసింది.ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రసాద్ గారు పండగకి వచ్చారు.. హిట్టు కొట్టారు