రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. శనివారం నుంచి స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో ఉన్న వారు ఊర్లకు ప్రయాణం అయ్యారు. హైదరాబాద్-విజయవాడ హైవే మీద విపరీతమైన రద్దీ ఉంది. ఇదిలా ఉంటే విద్యార్థులకు మాత్రమే కాక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సంక్రాంతి సందర్భంగా భారీగా సెలవులు వచ్చాయి. దీంతో వారు కూడా సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులు సెలవు రోజుల్లో కూడా పని చేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించినప్పటికీ, పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పలు జిల్లాల్లో మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలోని వార్డు సచివాలయాల అడ్మిన్‌ సెక్రటరీలకు లిఖితపూర్వకంగా, మౌఖికంగా ఈ సూచనలు జారీ చేశారు. పండుగ రోజులతో పాటు వారాంతాల్లో కూడా సచివాలయాల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా విధుల్లో ఉండేలా చూడాలని తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, సెలవుల్లో పనిచేసే ఉద్యోగులకు ఇతర పనిదినాల్లో అదనపు సెలవులు ఇవ్వకపోవడాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం, సంక్రాంతి పండుగ సెలవుల్లో కూడా సచివాలయాలు తెరిచే ఉండాలి. ప్రతి వార్డు సచివాలయంలో కనీసం ఒక ఉద్యోగి అయినా సరే విధులకు హాజరు కావాలి. ఈ నిబంధనను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సెలవు దినాల్లో పనిచేసినందుకు గాను, వారికి ఇతర పనిదినాల్లో అదనపు సెలవులు కల్పించడం లేదు. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇది ఉద్యోగులకు అన్యాయం చేయడమే అని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.