నాకెందుకయ్యా రాజకీయాలు.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాను.. ఆ భగవంతుడు నాకు ఈ రంగంలో టాలెంట్ ఇచ్చాడు.. సినిమాలు చేసుకుంటా అని పైకి చెప్తున్నా కూడా అతనిలో పసుపు సైనికుడు ఉన్నాడనేది బహిరంగ రహస్యం. ఇప్పుడంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. పార్టీలో పెద్ద యాక్టివ్‌గా లేరు కానీ.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడుగా గళం విప్పారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న శివాజీ.. తాజా రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో సలహాలిచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. అలాగని ఏదీ గమనించకుండా లేను. ఎక్కడైనా శృతి మించితే నేను మాట్లాడతా. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయ్యింది కాబట్టి సర్దుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. చిన్న చిన్న పొరపాట్లు తప్పితే రాష్ట్రానికి పెనుముప్పు అయితే కాదు. నూటికి నూరు శాతం ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని సంతృప్తి పరచలేదు. దేశాన్నైనా రాష్ట్రాన్నైనా నడపాల్సింది నాయకుడు. ఆ నాయకుడు సమర్ధుడైతే తిరుగుండదు. కూటమి ప్రభుత్వానికి సమర్థవంతమైన నాయకుడు ఉండటం వల్ల రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగలరని నా నమ్మకం. అక్కడక్కడా పొరపాట్లు అనేవి ఇక్కడే కాదు.. అమెరికాలో కూడా ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడింది. వ్యవస్థలో లోపాలనేవి ఉంటూనే ఉంటాయి. కానీ అప్పుడు (వైసీపీ) ఉన్నంత వ్యతిరేకత అయితే ఇప్పుడు లేదు. కూటమి నాయకుడు ఒత్తిడిని భరిస్తూనే రూల్ బుక్‌ని ఫాలో అవుతున్నారు. కొన్నిసందర్భాల్లో మాత్రం రాజు అనేవారు మొండిగా ఉండాల్సిందే. కొన్ని ఘటనల్లో ఆయన ఇంకా మొండిగా ఉండాలి. చాలా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ.. అవినీతిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వస్తే అద్భుతాలు జరుగుతాయని అనుకున్నారు.. కానీ అద్భుతాలు ఎలా జరుగుతాయి? అమరావతికి మళ్లీ భూసేకరణ చేస్తున్నారు. అది చాలా అవసరం. ఎందుకంటే అమరావతి అనేది భవిష్యత్ తరాల కోసం తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం కాదు. ఇంతకుముందులాగే మళ్లీ రైతుల నుంచి భూసేకరణ ఎందుకు కావాలంటే.. రాజధానికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండాలి. దుబాయ్ నుంచి చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. దుబాయ్‌కి పోటీగా ఉండేది అమరావతి మాత్రమే. భూసమీకరణ వల్ల రైతులకు నష్టం ఏం లేదు. అక్కడేం మూడు పంటలు పండవు. కాబట్టి డ్యామ్‌లు క్యాపిటల్ సిటీలు కట్టాలంటే భూముల్ని త్యాగం చేయాలి తప్పదు. భూ సమీకరణ వల్ల రైతులకు లాభమే తప్ప నష్టం కాదు. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రావాలంటే ఒకే ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది. అసలు నాకు ఇంత దారుణమైన ఓటమి ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు కలిగింది అని సమీక్ష నిర్వహించుకోవాలి. ఆయనంటే ప్రజల్లో ఒకరకమైన భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. అంతే తప్ప.. రప్పా.. రప్పా.. పర్రా.. పర్రా.. ఇవి కాదు. వాళ్లు వచ్చినా భయం ఉండదు. మా స్వేచ్ఛని హరించరు అనే ధైర్యం ఇవ్వాలి. నాపై ఎక్కువ మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టరు.. కానీ కొన్ని కామెంట్స్ వచ్చాయంటే.. అవి ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్లు పెట్టేవే. ఇవన్నీ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అనాలో.. ఎన్ని తిట్టాలో తిట్టారు. చివరికి ఏమైంది? ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్‌కి 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే జగన్ గారి వల్లే. గారిని పప్పు పప్పు అన్నారు. కానీ ప్రపంచం ఆయన పప్పు కాదు నిప్పు అని చెప్తోంది. పప్పు పప్పు అని లోకేష్ బాబుని రెచ్చగొట్టి నిప్పులు చేసింది వీళ్లే. రాజకీయం చేస్తే ప్రజలు మన వెనకాల నిలబడాలి తప్ప.. భయపడకూడదు. ఇదే భయం నెక్స్ట్ ఎలక్షన్స్‌కి కూడా ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకునే పని చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే వైఖరిలో పోతున్నారు. కూటమి నాయకుడు మొండోడు కాదు.. వాళ్లని అలా వదిలేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు శివాజీ.