ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఏర్పాటవుతున్నాయి. గతంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా ఆయా పరిశ్రమలు శంకుస్థాపనలు చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ఏఎంఎన్‌ఎస్‌ (ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా) సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా.. తాజాగా శంకుస్థాపనకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ నెల 7న శంకుస్థాపన చేస్తారని భావించారు.. కానీ ఈ నెల 23న మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపురేఖలు మార్చేలా కీలక ముందడుగు పడబోతుందని శ్రీనివాసవర్మ తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు సర్వం సిద్ధమైందన్నారు. ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు ఆర్సెలాల్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ సంస్థలు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమిపూజ చేస్తున్నట్లు ప్రకటించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏకంగా రూ.1.35 లక్షల కోట్ల అంచనాతో భారీ ప్లాంటు ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అన్నారు.ను ముందు తొలిదశలో రూ.80 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తారని కేంద్రమంత్రి వర్మ తెలిపారు. 2029 నాటికి తొలి దశ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారన్నారు. ఈ మేరకు దాదాపు 30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. 'ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త మైలురాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజయ్యపేటలో ఆర్సెలార్ మిత్తల్ & నిప్పన్ స్టీల్ సంస్థ ఆధ్వర్యంలో 1.35 లక్షల కోట్ల భారీ వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది' అంటూ కేంద్రమంత్రి ట్వీట్ చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది.. కేంద్రమంత్రి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. అనకాపల్లి జిల్లాలో ఈ ప్లాంట్ కోసం 2,200 ఎకరాలు కేటాయించారు.