: అనుకున్నదే జరిగింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఇంధనం రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయంగా వీటి కొరత ఏర్పడుతుందని.. ధరలు పెరగొచ్చన్న ఆందోళనలు నెలకొనగా అదే నిజమైంది. దేశీయంగా చమురు కంపెనీలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ. 60 పెరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఒక్కో సిలిండర్ ధర ఇంతకుముందు రూ. 905 గా ఉండగా.. ఇప్పుడు రూ. 965 కు చేరింది. పెరిగిన ధరలు మార్చి 7 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 115 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ రేటు రూ. 1930.50 గా ఉండగా.. ఇప్పుడు రూ. 115 పెరగడంతో ఇది రూ. 2045.50 కి ఎగబాకింది. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ద్వారా అందించే వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. . ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం వల్లే..యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అక్కడ హర్ముజ్ జలసంధిలో నౌకల్ని ఇరాన్ అడ్డుకుంటోంది. భారత్.. చమురు, గ్యాస్ అవసరాల్ని తీర్చుకునేందుకు ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా.. దేశీయంగా కూడా చమురు సంస్థలు ధరల్ని సవరించాల్సి వచ్చినట్లు పేర్కొన్నాయి. 11 నెలల తర్వాత పెరిగిన వంట గ్యాస్ ధరలు..దీంతో చాలా కాలం తర్వాత దేశంలో వంట పెరిగాయని చెప్పొచ్చు. చాలా కాలంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మార్చట్లేదు. చివరిసారిగా గతేడాది ఏప్రిల్‌లో రూ. 50 మేర పెంచాయి. దీంతో 11 నెలలుగా స్థిరంగానే ఉంటూ వచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్నే క్రమంగా మారుస్తూ వస్తుండగా.. ఇప్పుడు మాత్రం గృహ వినియోగ గ్యాస్ ధరల్ని కూడా ఒక్కసారిగా భారీగా పెరగడం సామాన్యులకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 913 కు చేరింది. ముంబైలో రూ. 912.50, కోల్‌కతాలో రూ. 939, చెన్నైలో రూ. 928.50 గా ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ. 1768.50 నుంచి రూ. 1883 కు పెరిగింది. ముంబైలో రూ. 1835, కోల్‌కతాలో రూ. 1990, చెన్నైలో రూ. 2043.50 కి చేరింది. లోకల్ సేల్స్ టాక్స్ లేదా వ్యాట్ కారణంగా ప్రాంతాల వారీగా ధరల్లో మార్పు ఉంటుంది. ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే హైదరాబాద్‌లోనే గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.కేంద్రం కీలక ఆదేశాలు..ధరల్ని పెంచేందుకు ముందటి రోజే శుక్రవారం (మార్చి 6) కేంద్రం.. చమురు రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలకు కాకుండా.. దేశీయ గృహ వినియోగదారులకే గ్యాస్ సరఫరా విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎల్‌పీజీ ఉత్పత్తిని కూడా పెంచాలని ఆదేశించింది. ఎల్‌పీజీ ఉత్పత్తి కోసం కీలకమైన ప్రొపేన్, బ్యుటేన్‌ను పెట్రో కెమికల్ ఉత్పత్తి కోసం కూడా దారి మళ్లించొద్దని స్పష్టం చేసింది.