సెంటు బాటిల్‌ను డ్రగ్స్ అనుకుని అరెస్ట్.. వీసా రద్దు.. భారతీయుడిపై అమెరికా బహిష్కరణ వేటు..!

Wait 5 sec.

గత కొద్ది కాలంగా వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది అమెరికా. చట్టబద్ధంగా వచ్చిన వారిపైనా విరుచుకుపడుతున్నారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ వీసాలు రద్దు చేసి... తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలోని అర్కన్‍సాస్ రాష్ట్రంలో జరిగింది. భారత సంతతికి చెందిన కపిల్ రఘు అనే వ్యక్తి వీసా రద్దు చేశారు. దీంతో ఎప్పుడు దేశం నుంచి బహిష్కరిస్తారో అనే భయంతో రఘు ఉన్నాడు. అతడి వద్ద ఉన్న సెంటు బాటిల్‌ను నల్లమందు అనుకుని రఘును మేలో అరెస్ట్ చేశారు. అక్కడి పోలీసులు చేసిన తప్పుకు.. రఘు బలి అవుతున్నాడు. కలిప్ రఘు అమెరికన్ పౌరురాలిని వివాహం చేసుకుని.. శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మే 3న బెంటన్ పోలీసులు.. చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కింద రఘును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అతడి కారులో "ఓపియం" అని లేబుల్ ఉన్న సీసాను చూశారు. దీంతో అందులో నిషేధిత మాదకద్రవ్యం (నల్లమందు) ఉందని పోలీసులు భావించారు. ఇది కేవలం డిజైనర్ సెంటు బాటిల్‌ అని రఘు ఎంత చెప్పినా వినకుండా.. అరెస్టు చేశారు. తాను అన్ని నిబంధనలు పాటిస్తున్నానని.. ఎందుకు అరెస్ట్ చేశారో తెలియడం లేదని రఘు వాపోయాడు. అర్కన్‌సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ ఆ సెంటు బాటిల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అందులో పర్‌ఫ్యూమ్ మాత్రమే ఉందని.. అది నల్లమందు కాదని తేల్చింది. అయినా రఘు మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. అక్కడ అధికారులు అతడి ఇమ్మిగ్రేషన్ పేపర్ వర్క్‌లో లోపాలు ఉన్నట్లు చెప్పారు. అతడి వీసా గడువు ముగిసిందని ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ రఘు లాయర్.. ప్రభుత్వ అధికారులు తప్పిదాల వల్లే.. వీసా గడువు ముగిసినట్లు చూపిస్తోందని తెలిపారు. దీంతో తనను విడుదల చేసినప్పటికీ.. ఏ క్షణమైన దేశం నుంచి బహిష్కరిస్తారనే భయంతో కాలం వెల్లదీస్తున్నాడు రఘు. అరెస్ట్ తర్వాత రఘు 30 రోజులు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్భందంలో ఉన్నాడు. మే 20న స్థానిక జిల్లా కోర్టు అతడిపై అభియోగాలు కొట్టేసినా.. రఘు వీసాను ఇమ్మిగ్రేషన్ అధికారులు రద్దు చేశారు. దీంతో అమెరికాలో అతడి చట్టబద్ధమైన గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు, విదేశీయులను అరెస్ట్ చేసేటప్పుడు ఆ దేశ కాన్సులేట్‌కు సమాచారం ఇవ్వాలని.. పోలీసులు అలా చేయలేదని రఘు లాయర్ పేర్కొన్నారు. అది చట్ట విరుద్ధమని తెలిపారు. ఇలాంటి దేశంలో ఉండాలనుకోవడం లేదు..!ఈ ఘటనతో అమెరికాలో తన భార్య జీవించాలనుకోవట్లేదని రఘు తెలిపాడు. తన కార్లు అమ్మేసి.. సంతోషంగా జీవించగలిగే ఇతర దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. కాగా, పోలీస్ కార్లు వెనుక వస్తేనే భయంగా ఉందని రఘు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇదొక్కటే కాదు.. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అమెరికాలో పోలీసులు చట్టాలు అమలు చేస్తున్నామనుకుంటూ.. వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.