82 ఏళ్ల బామ్మ 8 బతికున్న కప్పలను మింగింది.. తర్వాత ఏం జరిగిందంటే..?

Wait 5 sec.

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇప్పటికీ నాటు వైద్యాన్ని అనుసరిస్తున్నారు. ఎవరైనా అనారోగ్యం పాలైతే నాటు వైద్యం చేసే వారి వద్దకు వెళ్లి.. ఆకులు, పసర్లు వంటి వాటితో రోగాలను నయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాత కాలం వారు ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఇలాంటి వైద్యాలు వికటిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. తన అనారోగ్యం నయం చేసుకోవాలని తనకు తానే నాటు వైద్యం చేసుకుంది ఓ వృద్ధురాలు. అందులో భాగంగా బతికి ఉన్న 8 కప్పలను స్వాహా చేసింది. అనారోగ్యం తగ్గడం అటుంచితే.. ఆరోగ్యం మరింత క్షీణించింది.బతికున్న కప్పలను మింగేసింది.. తూర్పు చైనాకు చెందిన 82 ఏళ్ల ముసలావిడ జాంగ్.. నడుము నొప్పితో బాధ పడుతోంది. అయితే వైద్యుల వద్దకు వెళ్లకుండా తనకు తానే నాటు వైద్యంతో నయం చేసుకోవాలనుకుంది. బతికి ఉన్న కప్పలను తినడం వల్ల తన నొప్పి తగ్గుతుందని భావించింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. తన కోసం కొన్ని కప్పలను పట్టుకోవాలని కుటుంబ సభ్యులను కోరింది. దీంతో వారు తీసుకువచ్చిన వాటిలో మూడు కప్పలను ఒకరోజు.. తర్వాత రోజు 5 కప్పలను బతికుండగానే మింగేసింది జాంగ్. అన్నీ పెద్దవారి అరచేతి పరిమాణం కంటే చిన్నవిగా ఉన్నాయి.కప్పలను మింగిన తర్వాత జాంగ్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ సెప్టెంబర్ ప్రారంభంలో జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలోని ఒక ఆసుపత్రిలో చేరింది. కప్పలను తిన్న తర్వాత తన తల్లి నడవలేకపోయిందని ఆమె కుమారుడు తెలిపాడు. కప్పలను తిన్న తర్వాత జాంగ్‌కు మొదట్లో అసౌకర్యంగా అనిపించింది. కానీ క్రమంగా కొన్ని రోజుల్లో నొప్పి తీవ్రమైంది. ఏమైందని ఆరా తీస్తే.. అప్పుడు తన కుటుంబానికి తాను ఏమి చేసిందో చెప్పింది వృద్ధురాలు. పారాసైట్ ఇన్ఫెక్షన్లు సోకి.. అనంతరం ఆమెను జెజియాంగ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రికి తరలించారు. అక్కడ జాంగ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కణితి లాంటిది లేదన్నారు. అయితే, అధిక సంఖ్యలో ఆక్సిఫిల్ కణాలు ఉన్నట్లు తెలిపారు. ఇది పారాసైట్ ఇన్ఫెక్షన్లు లేదా రక్త రుగ్మతలను సూచిస్తుందని తెలిపారు. తదుపరి పరీక్షల తర్వాత జాంగ్‌కు నిజంగా పారాసైట్ ఇన్ఫెక్షన్లు సోకినట్లు నిర్ధరణ అయింది. కాగా, కప్పలను మింగడం వల్ల ముసలావిడ జీర్ణవ్యవస్థ దెబ్బతిందని.. స్పార్గనమ్‌తో (sparganum) సహా పలు రకాల పరాన్నజీవులు ఆమె శరీరంలో ఉన్నాయి అని ఆసుపత్రి వైద్యుడు ఒకరు చెప్పారు. రెండు వారాల చికిత్స తర్వాత జాంగ్‌ను డిశ్చార్జ్ చేశారు.ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని డాక్టర్ వు జోంగ్‌వెన్ అన్నారు. ఇటీవల కొన్నేళ్లలో ఇలాంటి కేసులు కొన్ని వచ్చాయన్నారు. ఇలా చేస్తున్నవారిలో వృద్ధులే అధికంగా ఉన్నారని తెలిపారు. చైనాలో చాలా మంది వృద్ధులు తన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఇలాంటివి చేస్తారన్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రం అయ్యాక ఆస్పత్రులకు వస్తారన్నారు. అయితే ఇలా బతుకున్న జంతువులను తింటే.. పరాన్నజీవులను శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్యుడు చెప్పారు. ఫలితంగా దృష్టి లోపం, ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లతో సోకుతాయని.. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా అవుతాయని వెల్లడించారు డాక్టర్ వు జోంగ్‌వెన్.