ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి కీవ్ స్టార్మర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్‌లో ప్రవేశపెట్టిన ఆధార్ విధానంపై ఆయన తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నారు. భారత్‌లో కొనసాగుతున్న విశిష్ట సంఖ్య అయిన ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ విప్లవంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే బ్రిటన్‌లోనూ డిజిటల్ ఐడీ వ్యవస్థను తీసుకురానున్నారు. ఇందుకోసం మన వ్యవస్థ గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధార్‌ను రూపొందించిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకనితో కీవ్ స్టార్మర్ భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇన్ఫోసిస్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని బ్రిటన్ అధికార వర్గాలు వెల్లడించాయి. బుధవారం ముంబైకి చేరుకున్న కీర్ స్టార్మర్.. నందన్‌ నీలేకనితో భేటీ కావడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఇక నందన్ నీలేకనితో కీవ్ స్టార్మర్‌ భేటీకి సంబంధించి బ్రిటన్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే.. ఇన్ఫోసిస్‌తో బ్రిటన్‌కు ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం వీరిద్దరి మధ్య ఈ భేటీ జరగలేదని తేల్చి చెప్పారు. ఆధార్‌ ఎలా పనిచేస్తుంది.. ఇక దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే నందన్ నీలేకనితో కీర్ స్టార్మర్ సమావేశం అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి తమ డిజిటల్‌ ఐడీ ప్రణాళికల్లో బయోమెట్రిక్‌ డేటా అంశం లేదని స్పష్టం చేశారు.తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఈ డిజిటల్‌ ఐడీ సాయంతో బ్రిటన్ పౌరులు ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ పథకాలు, ఇతర ప్రజా సేవలను సులభంగా పొందవచ్చని వెల్లడించారు. ఒకవేళ బ్రిటన్ పౌరులకు ఈ డిజిటల్‌ ఐడీ కార్డు లేకపోతే యూకేలో పనిచేసేందుకు అర్హత లేదని తేల్చి చెప్పారు. ఇక ఇటీవల భారత పర్యటనకు వచ్చే ముందు కూడా కీర్ స్టార్మర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించడం విశేషం. భారత్‌లో ఆధార్‌ ఐడీ వ్యవస్థ భారీ విజయాన్ని సాధించిందని.. అందుకే ఈ పర్యటనలో దీన్ని అజెండాగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తాను భారత్‌లో నిర్వహించే సమావేశాల్లో ఆధార్‌ కోసం కూడా ఒక భేటీ ఉంటుందని తెలిపారు.గతంలో బ్రిటన్‌లో గుర్తింపు కార్డులు ఉండగా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తప్పనిసరి కాదు అంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐడీ కార్డుల వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని.. ప్రైవేట్ సమాచారం బహిర్గతం అవుతుందని పౌర హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేయడంతో అప్పట్లో వాటిని రద్దు చేశారు. అనంతరం టోనీ బ్లెయర్‌ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బయోమెట్రిక్ ఐడీ కార్డులను తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా.. ప్రజలు, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారు. తాజాగా అక్రమ వలసలను కట్టడి చేయాలని నిర్ణయించుకున్న కీర్‌ స్టార్మర్‌ సర్కార్.. డిజిటల్‌ ఐడీ ప్రణాళికలను మొదలుపెట్టింది.మరోవైపు.. 2009 జూన్‌ 25వ తేదీన అప్పటి యూపీఏ-2 నేతృత్వంలోని భారత ప్రభుత్వం.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)ని ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్ అయిన నందన్‌ నీలేకనీకి కేబినెట్‌ హోదా ఇచ్చి.. యూఐడీఏఐకి ఛైర్మన్‌గా నియమించింది. 2010 సెప్టెంబర్‌ 29వ తేదీన మహారాష్ట్రలోని ఒక గ్రామంలో తొలిసారి ఆధార్‌ కార్డును జారీచేశారు. అప్పటి నుంచి గత 15 ఏళ్లలో దేశంలో 143 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు అందించారు.