Gold ETF: బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ 2025లోనే ఏకంగా 50 శాతానికిపైగా ధర పెరిగింది. పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అందులో కొంత మంది ఇన్వెస్టర్లు బంగారం పెట్టుబడులతో మల్టీబ్యాగర్ రాబడులు అందుకుంటున్నారు. స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేకుండా భారీగా రాబడులు పొందుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి కొన్ని స్కీమ్స్ భారీ లాభాలు అందించాయి. అదే (). మరి ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం. దేశంలో అత్యంత పురాతన గోల్డ్ ఈటీఎఫ్‌గా నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ పేరుగాంచింది. ఈ స్కీమ్ 2007 జులై నెలలో ప్రారంభమైంది. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు 950 శాతం మేర లాభాలు ఇచ్చింది. 18 ఏళ్ల క్రితం ఇందులో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ. 1 కోటికి పైగా అవుతుంది. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ స్కీమ్ ప్రస్తుతం దాదాపు రూ. 24,000 కోట్లకు పైగా పెట్టుబడులను కలిగి ఉంది. అంతే కాదు గత ఏడాదిలో కాలంలోనే ఇది 56 శాతం మేర పెరిగింది. 18 ఏళ్లలో చూసుకుంటే ఏడాదికి సగటున వార్షిక రాబడి 13.5 శాతంగా ఉంది. భారత్‌లో ఈరోజు 10 గ్రాముల బంగారం రేటు రూ.1.23 లక్షలు దాటగా కిలో వెండి రూ. 1.70 లక్షల స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణం, రాజకీయ భౌగోళిక అనిశ్చితి, మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకుల కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు. పసిడి సురక్షితమైన మార్గంగా భావించి కోట్లాది రూపాయలు వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.పెట్టుబడి పోర్ట్‌ ఫోలియోలో 15 శాతం వరకు బంగారం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇది షేర్లు లేదా ఇతర పెట్టుబడుల విలువ పడిపోయినప్పుడు కాపాడుతుంది. షేర్లు, బాండ్ల వంటి పెట్టుబడి అంశాలు రుణాలపై ఆధారపడతాయి. కానీ బంగారం అలాంటి హెచ్చుతగ్గల నుంచి కాపాడుతుంది. దీంతో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం భారీగా కొంటున్నాయి. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్, రాజకీయ అనిశ్చితులు సైతం బంగారం డిమాండ్‌ను పెంచుతున్నాయి. భారత్‌లో 86 శాతం బంగారం దిగుమతి అవుతోంది. రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది.2025లో ఇప్పటి వరకు గోల్డ్ ఈటీఎఫ్‌ స్కీమ్స్‌లో 2.18 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదిలో 1.28 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగింది. 2022లో గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు చూస్తే 22 మిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. గత ఏడాది నుంచి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. షేర్ మార్కెట్లో లాభాలు తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.