ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఏకంగా రూ.1.47 లక్షల కోట్లతో, ఆ జిల్లాకు మహర్దశ.. నవంబర్‌లో ఫిక్స్

Wait 5 sec.

విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గూగుల్‌తో డేటాసెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు, అలాగే ఏరోస్పేస్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముంబైలో జరిగిన రోడ్‌షోలో మంత్రి లోకేశ్ కీలక విషయాలను వెల్లడించారు. డేటాసెంటర్ ఏర్పాటు కోసం కేంద్రంతో మాట్లాడి పాలసీలో మార్పులు తెచ్చామని, క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆయన వివరించారు. కియా సంస్థకు ఇచ్చిన ప్రోత్సాహకాలను అనుబంధ పరిశ్రమలకు కూడా అందించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని.. ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు మంత్రి లోకేష్. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిత్తల్ ప్లాంట్ రాబోతోందని.. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలకు ( స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ఆర్సెలార్‌ మిత్తల్‌ ప్లాంటు నిదర్శనమన్నారు. ఆ కంపెనీకి జూమ్ కాల్‌లోనే అన్ని అనుమతులు మంజూరు చేశామని పేర్కొన్నారు. పనులు ఈ ఏడాది నవంబరు నెలలో ప్రారంభమవుతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్‌ మిత్తల్, నిప్పన్‌ స్టీల్స్‌ సంయుక్తంగా రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. మొదటి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2033 నాటికి దక్షిణాదిలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రంగా అవతరించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లి మండలంలో 2,020 ఎకరాల భూమిని దీని కోసం కేటాయించారు. ఈ ఒప్పందం ప్రకారం, ఆర్సెలార్‌ మిత్తల్ రెండు దశల్లో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. ఈ ప్లాంట్ పూర్తయితే, విశాఖ ఉక్కుతో కలిసి ఉమ్మడి విశాఖ ప్రాంతంలో ఏటా 25.1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తితో దక్షిణాదిలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది.మొదటి దశలో 7.3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆర్సెలార్‌ మిత్తల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొదటి దశ ప్లాంట్‌ను 2029 నాటికి పూర్తి చేసి, సుమారు 20 వేల మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళిక రూపొందించారు. రెండో దశలో 10.5 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను విస్తరించనున్నారు. ఈ రెండో దశ ప్లాంట్‌ను 2033 నాటికి పూర్తి చేసి, మరో 35 వేల మందికి ఉపాధి కల్పించాలని యోచిస్తున్నారు. ఈ భారీ పెట్టుబడితో అనకాపల్లి ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. ముఖ్యమంత్రి చొరవతో విశాఖకు ముంబై కంటే రెట్టింపు సామర్థ్యం గల శక్తిమంతమైన సబ్‌మెరైన్ కేబుల్స్ వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ ప్రాజెక్టును తమదిగా భావించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెట్టుబడుల ఒప్పందం పూర్తయితే, ఆ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి, అన్ని విధాలా సహాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. 3,500 ఎకరాల్లో ఏరోస్పేస్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.