హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన భూ వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.177 కోట్ల ధర పలికింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన వేలాల్లోనే అత్యధిక ధర కావడం విశేషం. గచ్చిబౌలికి అత్యంత సమీపంలో ఐటీ, పారిశ్రామికీకరణకు గుండెకాయలాంటి రాయదుర్గం ప్రాంతంలో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమి వేలానికి టీజీఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ భూమి హైటెక్‌ సిటీ-గచ్చిబౌలి మధ్య ఉండడం, మియాపూర్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ (ORR), అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా అనుసంధానం కావడం దీని ప్రాధాన్యతను పెంచాయి. ఐటీ, ఐటీఈఎస్, కమర్షియల్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ వంటి బహుళ అభివృద్ధి రంగాలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో.. పెట్టుబడిదారులు భారీ మొత్తాన్ని చెల్లించడానికి ఆసక్తి చూపారు.సోమవారం ఈ-వేలం విధానంలో మొత్తం 18.67 ఎకరాల భూమి అమ్ముడైంది. ఇందులో సర్వే నంబరు 83/1లోని ప్లాట్ నంబరు 15ఎ2లో ఉన్న 7.67 ఎకరాల భూమి ఒక్కో ఎకరాకు రూ.177 కోట్లు చొప్పున పలికింది. ఈ భూమిని 'ఎంఎస్‌ఎన్‌' సంస్థ కొనుగోలు చేయగా.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,357.59 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే సర్వే నంబరులో ఉన్న మిగిలిన 11 ఎకరాలను 'ప్రెస్టేజ్‌ రియాలిటీ' సంస్థ దక్కించుకుంది. ఈ ప్లాట్‌కు ఒక్కో ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున ధర లభించగా.. మొత్తం రూ.1,556.5 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా.. ఈ 18.67 ఎకరాల భూవేలం ద్వారా, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌లతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,135 కోట్ల భారీ ఆదాయం లభిస్తుందని టీజీఐఐసీ వెల్లడించింది. గత రికార్డులు బద్దలుఈ సందర్భంగా టీజీఐఐసీ ఎండీ శశాంక మాట్లాడుతూ.. తాజా ధర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మునుపటి రికార్డులను బద్దలు కొట్టిందని తెలిపారు. 2022లో కోకాపేట నియోపోలీస్‌లో జరిగిన వేలంలో ఎకరాకు రూ.100.75 కోట్లు గరిష్ఠ ధర పలికిన రికార్డును.. ఈ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వేలం అధిగమించింది. కొత్త రికార్డు ధర రూ.177 కోట్లు కావడంతో.. ఇది గత కోకాపేట ధర కంటే దాదాపు 75% అధిక వృద్ధిని సాధించినట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పారదర్శక, వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తోందని.. పెట్టుబడిదారులు హైదరాబాద్‌ భవిష్యత్తుపై ఉంచిన నమ్మకానికి ఈ వేలం నిదర్శనమని శశాంక పేర్కొన్నారు. ఈ వేలాన్ని జేఎల్ఎల్ ఇండియా, ఎంఎస్టీసీ సంస్థల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.చింతల్‌లోనూ రికార్డు ధరఒకవైపు రాయదుర్గంలో వాణిజ్య భూములకు భారీ ధరలు పలకగా.. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్‌లో నివాస భూములు సైతం రికార్డు స్థాయి ధరలను నమోదు చేశాయి. సోమవారం జరిగిన బహిరంగ వేలంలో 513 చదరపు గజాల విస్తీర్ణంలోని ఒక ప్లాట్‌కు చదరపు గజం (చ.గ.) ధర రూ.1.14 లక్షలు పలికింది. హెచ్‌ఐజీ కేటగిరీకి చెందిన మరో ప్లాట్‌ చ.గ. రూ.లక్షకు అమ్ముడైంది. ఈ వేలంలో మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్లకు గాను హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల ఆదాయం లభించింది. వేలంలో పాల్గొన్న 27 మంది బిడ్డర్ల కారణంగా చ.గ. సగటు ధర రూ.91,947గా నమోదైంది. ఈ డబుల్ రికార్డులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత జోరును సంతరించుకుంది.