ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. టమాటా రైతులకు అండగా నిలుస్తామని తెలిపింది. టమాటా ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. రాప్తాడు మార్కెట్‌లో కిలో టమాటా ధర గరిష్ఠంగా రూ.18, కనిష్ఠంగా రూ.9, సగటు ధర రూ.12గా నమోదైంది. పత్తికొండ మార్కెట్‌కు టమాటా దిగుబడి పెరగడంతో, అక్కడి నుంచి 10 టన్నులను చిత్తూరు ప్రాసెసింగ్ యూనిట్‌కు, మరో 15 టన్నులను రైతు బజార్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వర్షాల కారణంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. రైతు బజార్లలో టమాటాలను కేజీ రూ.20 వరకు అమ్మేలా ప్లాన్ చేస్తున్నారు. దసరా సెలవుల కారణంగా మార్కెట్‌కు అదనంగా టమాటా సరుకు రావడంతో పాటు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమ్మకాలు మందగించడం, ఎగుమతులకు ఆటంకం ఏర్పడటం వంటి కారణాలతో ధరలు తగ్గాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, రైతులకు మంచి ధర లభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాధారణంగా పత్తికొండ మార్కెట్‌కు 30-40 టన్నుల టమాటా సరుకు వస్తుందని, అయితే దసరా సెలవుల వల్ల అదనంగా 10 టన్నులు వచ్చిందని మంత్రి వివరించారు. రోడ్లపై రెండవ రకం టమాటాలను పడేసి గందరగోళం సృష్టించారని, ఇప్పటివరకు 10 టన్నుల టమాటాలను వివిధ రైతుబజార్లకు పంపించామని ఆయన తెలిపారు. టమోటాలకు ప్రస్తుతం ట్రెండింగ్ ధరను బట్టి మంచి ధర లభిస్తోందని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.ఇదిలా ఉంటే కొన్ని మార్కెట్లలో టమాటాలు కేజీ రూ.32 లెక్కన అమ్మేస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో బిల్లును పోస్ట్ చేశారు. పాపం రైతులు కిలో టమాటాలు రూపాయికి అమ్ముతుంటే.. ఇటు కొందరు వ్యాపారులు మాత్రం కేజీ రూ.32కు అమ్ముతున్నారని.. ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు. ఇటీవల ఉల్లి ధరలు కూడా దారుణంగా పడిపోవడంతో రైతులు ఇబ్బందిపడ్డారు. దీంతో ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లు, జరిపింది. కేజీ జస్ట్ రూ.14కు మాత్రమే అమ్మకాలు జరిపింది. అంతేకాదు రేషన్ షాపులు, హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, అన్న క్యాంటీన్లలో కూడా ఈ ఉల్లిపాయలను తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం రైతులు, కొనుగోలుదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. ఇప్పుడు టమాటాలను కూడా రైతు బజార్లకు తరలించి.. కనీసం కిలో రూ.20, ఆపైన ధరలకు అమ్మేలా ప్లాన్ చేసింది. ప్రజలు ఎన్ని కేజీలైనా కొనగోలు చేయొచ్చు.