ఏపీ కాంగ్రెస్ చీఫ్ మరోసారి గుడులు, చర్చిల ప్రస్తావన తీసుకువచ్చారు. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను వైఎస్ షర్మిల మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ఆస్పత్రిలో బిడ్డల అరోగ్య పరిస్థితి చూసి షాక్ అయ్యానన్న షర్మిల.. వారి శరీరాలు చూస్తే ప్రభుత్వం ఏం భోజనం పెడుతుందో అర్థమైందంటూ మండిపడ్డారు. వారిని చూస్తే సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వచ్చాయని విమర్శించారు. తాను ఇటీవల గుడితోపాటు బడి కూడా ముఖ్యమని అంటే.. తన వ్యాఖ్యలకు మతం రంగు పూసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. కురుపాం గురుకుల పాఠశాల ఘటన తన డిమాండ్‌కు నిదర్శనమని షర్మిల అభిప్రాయపడ్డారు.*" ఆస్పత్రిలో పిల్లల పరిస్థితి చూసి షాక్ అయ్యా. వారి ఆరోగ్య పరిస్థితి గురించిచాలా ఆందోళనగా ఉంది. బిడ్డల ఆరోగ్యం క్షీణించింది, వారి శరీరాలు చూస్తే హాస్టల్లో ప్రభుత్వం ఎలాంటి ఆహారం పెడుతుందో అర్థం అవుతుంది. వారిని చూస్తే సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వచ్చాయి. గిరిజన హాస్టల్లో త్రాగడానికి కనీసం నీళ్లు కూడా ఉండవట. స్నానం చేయడానికి కూడా నీళ్ళు ఇవ్వరట. కలుషిత నీరు తాగడం వలనే బిడ్డలకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరం. కొంతమంది ఐసీయూలో చావు బ్రతుకులతో పోరాటం చేస్తున్నారు. హాస్టల్‌లో ఆర్వో సిస్టం పనిచేయడం లేదట.ప్రభుత్వాన్ని నమ్మి పిల్లలను హాస్టల్లో వేస్తే ప్రభుత్వం చేసేది ఏంటి ? మంచి నీళ్ళు, భోజనం పెట్టలేని స్థితిలో ఉందా ? కురుపాం గురుకులం ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి" అంటూ షర్మిల డిమాండ్ చేశారు.*మరోవైపు హాస్టల్‌లో 228 మంది విద్యార్థినులకు ఒకటే బాత్రూమ్ ఉండటం దారుణమని షర్మిల మండిపడ్డారు. 17 మంది ఒకటే రూమ్‌లో నేలమీద పడుకోవాల్సి రావటంపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని ఇటీవల తాను ప్రశ్నించానని. అందులో తప్పేమైనా ఉందా అని షర్మిల నిలదీశారు. తాను అడిగిన ప్రశ్నకు మతం రంగు పులిమారన్న వైఎస్ షర్మిల.. తనకు వ్యక్తిగతంగా అన్ని మతాలు సమానమేనని.. కానీ ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక మతానికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. దీంతో మిగతా మతాల వారికి అభద్రతా భావం కలుగుతోందన్నారు. గుడులు కడతామని చెప్పేవారు మసీదులు, చర్చిలు కూడా కడతామని చెప్పాలి కదా అని ప్రశ్నించారు. పురోహితులతో పాటుగా ఇమామ్‌లకు, ఫాస్టర్లకు ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.*సీఎం చెప్తున్నట్లు స్వర్ణాంధ్ర 2047 కాదు.. స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలని షర్మిల అన్నారు.2047 వరకు ఎదురు చూసే పరిస్థితి లేదని.. ఇప్పుడు చదువుతున్నవారికి 2047 విజన్ ఏం ఉపయోగపడుతుందని షర్మిల ప్రశ్నించారు. రెండేళ్లలోపు రాష్ట్రంలోని హాస్టళ్లను బాగుచేయాలని డిమాండ్ చేశారు.