ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల (అక్టోబర్) 8వ తేదీ నుంచి వికలాంగుల పింఛన్ల రీ అసెస్మెంట్ నిర్వహించనున్నారు. గతంలో దివ్యాంగుల పింఛన్ల రద్దు/ పింఛన్ రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి రీ అసెస్మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ బుధవారం (8వ తేదీ) నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఎంపీడీవో లాగిన్‌లో షెడ్యూల్ కేటాయించిన వారికి WEA లాగిన్ నందు నోటీసులు జనరేట్ చేశారు. అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి నోటీసులు జారీ చేసి రీ అసెస్మెంట్‌కు హాజరవ్వాలని కోరనున్నారు.ఈ రీ అసెస్మెంట్‌‌కు సంబంధించి సచివాలయాల వారీగా పరిశీలన కోసం తేదీలు కేటాయించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. జిల్లాల్లోని డీసీహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ల సహాయంతో పెన్షన్ దారులను ఆయా ఆసుపత్రులకు అనుసంధానం (మ్యాప్) చేయాలి. వారు ఏయే తేదీల్లో ఆసుపత్రులకు వెళ్ళాలో ఖరారు చేసి, ఆ సమాచారాన్ని సచివాలయాలకు అందించాలి. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులు అప్పీల్ చేసుకున్న లబ్ధిదారులకు పెన్షన్ల పరిశీలన కోసం తేదీలు కేటాయిస్తారు. ఈ పరిశీలనకు హాజరుకాని వారి పింఛన్లు నిలిపివేస్తారు. ఇప్పటికే నోటీసుల ఇవ్వడం మొదలైంది. ఈ నెల 8వ తేదీ నుంచి సచివాలయాల్లో పరిశీలన మొదలవుతుంది. బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే ఈ పరిశీలన జరుగుతుంది. ఆరోగ్య పింఛన్‌లు తీసుకుంటున్నవారు కచ్చితంగా ఆస్పత్రులకు వెళ్లాలి. పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితా ఇచ్చి పెన్షన్లు ఖరారు చేస్తారు. ఈ పరిశీలనకు ఎవరైనా హాజరుకాకపోయినా, ఇచ్చిన నోటీసును తీసుకోకపోయినా వారి పింఛన్ తాత్కాలికంగా నిలిపివేస్తారు.గత ప్రభుత్వ హయాంలో వికలాంగ పింఛన్ల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తప్పుడు పత్రాలతో దివ్యాంగ పింఛన్లు పొందిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రీ వెరిఫికేషన్ (పునఃపరిశీలన) కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, సదరం సర్టిఫికెట్లను పరిశీలించారు. అర్హత లేనివారిని గుర్తించి నోటీసులు జారీ చేసి వారి పింఛన్లు నిలిపివేయాలని నిర్ణయించారు. రెండు నెలల క్రితం అనర్హుల్ని గుర్తించి నోటీసులు కూడా జారీ చేశారు.. అయితే ఈ వ్యవహారంలో కొంత గందరగోళం ఏర్పడటంతో ప్రభుత్వం నోటీసులు జారీచేసినవారు అవకాశం కల్పించింది. అలాగే అందరికి పింఛన్ల పంపిణీ కొనసాగించింది. తనిఖీలో అనర్హులుగా తేలిన కొందరు, వాస్తవానికి వితంతు పింఛనుకు అర్హులని ప్రభుత్వం గుర్తించింది. తాము వితంతు పింఛనుకు అర్హులమని, ఆ పింఛను మంజూరు చేయాలని బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం.. ఇప్పటికే గుర్తించిన అనర్హుల్లో, వృద్ధాప్య పింఛను కేటగిరీ కిందకు వచ్చే వారిని ఆ పింఛనుకు మార్చారు. మిగిలిన వారి విషయంలో, వితంతు పింఛనుకు అర్హత ఉన్నవారిని కూడా ఆయా కేటగిరిల్లోకి మార్చారు. అయితే పింఛన్‌ విషయంలో అనర్హులుగా తేలి.. ఇటీవల నోటీసులు అందుకున్నవారిలో చాలామంది అప్పీల్ చేసుకున్నారు. వారందరికి మరోసారి నోటీసులు జారీ చేసి ఈ నెల 8 నుంచి రీ అసెస్మెంట్ ప్రారంభించనున్నారు.