పత్తి రైతులకు గుడ్ న్యూస్.. సీసీఐ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్, ఎప్పట్నుంచంటే..?

Wait 5 sec.

తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ అధికారులు, రాష్ట్రంలోని కాటన్ మిల్లర్లతో సోమవారం నిర్వహించిన కీలక సమావేశంలో ఏకాభిప్రాయం కుదరడంతో ఈ ప్రతిష్టంభన వీడింది.గత కొద్ది రోజులుగా మిల్లర్లు టెండరు నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పత్తి క్వింటా రూ.5 వేలకు మించి ఎవరూ కొనటం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది రూ. 9 వేల వరకు పలికిన పత్తి ఈ ఏడాది రూ.5 వేలకే అడుగుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారభించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో సీసీఐ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) లలిత్‌కుమార్‌ సింగ్‌, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సంచాలకులు గోపి, లక్ష్మీబాయి, తెలంగాణ కాటన్ మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు మంత్రి తుమ్మలతో జరిగిన భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మిల్లర్లు ముఖ్యంగా దూదిశాతం, స్లాట్ బుకింగ్, జాబ్‌వర్క్ టెండర్లలోని L-1, L-2 నిబంధనల గురించి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్‌ సింగ్‌.. దేశవ్యాప్తంగా ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కానప్పటికీ రాష్ట్ర మిల్లర్ల సమస్యల పరిష్కారం కోసం L-1, L-2 నిబంధనల్లో సడలింపులు ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా జాబ్‌వర్క్‌కు అవకాశాలు కల్పిస్తామని, మిల్లర్ల సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ హామీతో మిల్లర్లు టెండర్లలో పాల్గొనడానికి అంగీకరించారు.ఈ నెల 22 లేదా 23 నుండి కొనుగోళ్లు ప్రారంభంచర్చలు ఫలించిన నేపథ్యంలో.. మంగళవారం నుంచే రాష్ట్రంలోని 341 మంది మిల్లర్లు జాబ్‌వర్క్‌కు సంబంధించిన టెండర్లను దాఖలు చేయనున్నారు. బుధవారంతో టెండర్ల గడువు ముగియనుంది. ఆ వెంటనే సీసీఐ, మిల్లర్లతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, వీలైనంత త్వరగా పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. వాస్తవానికి ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు చేపట్టాలని సీసీఐ భావించినప్పటికీ.. మిల్లర్లు మరో రెండు రోజుల గడువు కోరడంతో ఈ నెల 22 లేదా 23వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీసీఐ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీంతో పంట దిగుబడిని విక్రయించడానికి ఎదురుచూస్తున్న వేలాది మంది రైతులకు ఊరట లభించింది.