ఏపీలో దగ్గు మందుపై ప్రభుత్వం ప్రకటన.. డాక్టర్లకు కీలక ఆదేశాలు, అలా చేయొద్దు

Wait 5 sec.

దేశ వ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే దగ్గు మందు వ్యవహారం కలకలం రేపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కల్తీ దగ్గు మందు తాగి పిల్లలు చనిపోయిన ఘటన సంగతి తెలిసిందే. అయితే ఏపీకి ఆ దగ్గు మందు సరఫరా కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామాలపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్, ఔషధ నియంత్రణ పరిపాలనా ఇంఛార్జ్ డైరెక్టర్‌ జనరల్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ గిరీశ మంత్రికి నివేదికలు అందించారు. కేంద్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సూచనల మేరకు, రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు, జలుబుకు సంబంధించిన ద్రవరూప మందులను సూచించవద్దని వైద్యులకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మందుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 'కోల్ర్డిఫ్‌' మందు దొరకలేదన్నారు. ఈ మందు రాష్ట్రంలో ఏ మెడికల్ షాపునకు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులకు గానీ సరఫరా కాలేదని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 12 మంది చిన్నారుల మరణాలకు 'కోల్ర్డిఫ్‌' కల్తీ దగ్గు మందు కారణమైంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ఈ మందును నిషేధించారు.. అలాగే రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. రెండేళ్లుపైన వయసున్న పిల్లలకు కూడా డాక్టర్లు సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే దగ్గు మందు ఇవ్వాలని సూచిస్తున్నారు.డీఎంహెచ్‌వోపై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆగ్రహంమరోవైపు గుంటూరు సమీపంలోని తురకపాలెం బీసీ కాలనీకి చెందిన చల్లా కృష్ణవేణి అనే మహిళ మెలియాయిడోసిస్‌ వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లో ఆదివారం చనిపోయారు. ఈ ఘటనతో ఈ ఘటనపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజులుగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా సరైన ఫాలో అప్‌ లేకపోవడంపై ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రశ్నించారు. కమిషనర్‌ వీరపాండియన్‌ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.విజయలక్ష్మీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రోగి పరిస్థితిని సరిగ్గా పర్యవేక్షించలేదని డీఎంహెచ్‌వోపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.తురకపాలెంలో నెలకొన్న పరిస్థితిని మరోసారి సమీక్షించి, సమగ్ర నివేదికను తనకు అందజేయాలని కమిషనర్‌ ఆదేశించారు. మెలియాయిడోసిస్‌ అనేది ఒక రకమైన బాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది చర్మం ద్వారా గాయాల్లోకి ప్రవేశించి, శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకం కావచ్చు.