సచిన్‌ను దాటేసిన జైస్వాల్.. ఫస్ట్ ఇండియన్ పేసర్‌గా బుమ్రా రికార్డ్..వెస్టిండీస్‌తో రెండో టెస్ట్..!

Wait 5 sec.

మొదటి టెస్టులో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో టెస్టులోనూ తొలి రోజే పట్టుబిగించింది. భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 రన్స్ చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. 173 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్ (87) కూడా సత్తా చాటాడు. ఇక్కడ ఆది నుంచి దూకుడుగా ఆడిన జైస్వాల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ 23 ఏళ్ల డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ 253 బంతుల్లో 173 రన్స్‌తో ఆడుతున్నాడు. తన టెస్ట్ కెరీర్‌లో కేవలం 26 మ్యాచ్‌ల్లోనే 48వ ఇన్నింగ్స్‌లో ఏడో సెంచరీ చేయడం విశేషం. ఇక్కడే మరో ఘనత సాధించాడు.తన 7 టెస్టు సెంచరీల్లో 5 శతకాల్ని 150 పరుగులు దాటించేయడం విశేషం. ఇక్కడే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 23 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా 150 ప్లస్ స్కోర్లు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్ తన 24వ బర్త్‌డేకు ముందు టెస్టుల్లో 4 సార్లు మాత్రమే 150 ప్లస్ రన్స్ చేయగా.. జైస్వాల్ 23 ఏళ్ల వయసులోనే ఐదు సార్లు ఈ ఘనత సాధించాడు.ఈ ఎలైట్ లిస్ట్‌లో ఓవరాల్‌గా ఆసీస్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్.. 24 ఏళ్లలోపు ఏకంగా 8 సార్లు 150 ప్లస్ స్కోర్లు చేసి టాప్‌లో నిలిచాడు. జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సమయంలో జైస్వాల్.. తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌లో 3 వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. బుమ్రా తొలి పేసర్‌గా..మరోవైపు.. వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ ద్వారా భారత స్టార్ పేసర్.. జస్‌ప్రీత్ బుమ్రా కూడా అరుదైన రికార్డు సాధించాడు. విండీస్‌తో మ్యాచ్.. బుమ్రాకు 50వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 50 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల చొప్పున ఆడిన తొలి పేసర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 49 టెస్టుల్లో 222 వికెట్లు తీశాడు. 89 వన్డేల్లో 149 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. అంతర్జాతీయ టీ-20ల్లోనూ 75 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు.ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా.. అన్ని ఫార్మాట్లలో 50 కిపైగా మ్యాచ్‌ల చొప్పున ఆడినప్పటికీ.. తొలి పేసర్‌గా బుమ్రా ఈ లిస్టులో చేరాడు.