మహిళలకు దీపావళి కానుక..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత, జౌళి శాఖ ద్వారా నేత కార్మికులకు అండగా ఉండేందుకు, మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. నేడు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల (Self Help Groups - SHGs) మహిళలకు ‘ఇందిరా మహిళాశక్తి చీరలు’ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 15వ తేదీ కల్లా ఈ చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంటే ఈ చీరలు దీపావళి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం మొత్తం 4.34 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం కాగా.. ఇప్పటివరకు 3.65 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి అయింది. ఇప్పటికే 33.35 లక్షల చీరలు రాష్ట్రంలోని జిల్లా గోడౌన్లకు చేరాయి. ఈ కార్యక్రమం ద్వారా 6,900 మంది నేత కార్మికులకు సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు నిరంతర ఉపాధి లభించింది. తద్వారా వీరు నెలకు రూ. 18 వేల నుంచి రూ. 22 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. నేత కార్మికుల ఆర్థిక భరోసా కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. 6,780 మంది నేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ (Loan Waiver) అందించే ప్రక్రియను త్వరితగతిన ముగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరానికి నేతన్న భరోసా పథకం కింద రూ. 48.80 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా.. నేత కార్మికులకు రూ. 18,000, అనుబంధ కార్మికులకు రూ. 6,000 చొప్పున ఏడాదికి రెండు విడతలుగా ఆర్థిక ప్రోత్సాహం అందజేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత రంగానికి మరింత స్థిరత్వాన్ని తీసుకురావడానికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా.. రాబోయే సంవత్సరంలో అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాల ఆర్డర్లను టెస్కో ద్వారా మాత్రమే సేకరించి.. వాటిని చేనేత సహకార సంఘాలకు వర్క్ ఆర్డర్‌లుగా ఇవ్వాలని సూచించారు. ఇది నేత కార్మికులకు ఏడాది పొడవునా పని లభించడానికి దోహదపడుతుంది. అంతే కాకుండా.. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కుకు తరలించేందుకు ప్రారంభ చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి నిర్దేశించారు. ఈ సమీక్షలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితర అధికారులు పాల్గొన్నారు.