ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కలిసి 'ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టెక్నాలజీలో నైపుణ్యం పెంచడం. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద, 38 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఒక్కోదానికి 30 చొప్పున ఇన్ఫోసిస్ ట్యాబ్‌లను అందించారు. ఈ ట్యాబ్‌ల ద్వారా 6 నుంచి 9 తరగతుల డిజిటల్ పద్ధతిలో పాఠాలు చెప్పనున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు డిజిటల్ విద్యపై శిక్షణ ఇచ్చారు.స్కూల్ విద్యార్థులకు మేలు చేసేలాఈ 'ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్' కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా నేర్చుకుంటారు. ట్యాబ్‌ల సహాయంతో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులకు బాగా అర్థమవుతాయని భావిస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా డిజిటల్ బోధనపై శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఈ కొత్త పద్ధతిని సమర్థవంతంగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇన్ఫోసిస్‌లో అప్రెంటిస్‌షిప్‌కు అవకాశంరాష్ట్రంలోని 6 నుంచి 9 తరగతుల విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష కలిసి ట్యాబ్ కంటెంట్‌ను రూపొందించాయి. గణితం, సైన్స్, ఆంగ్లం, జీవన నైపుణ్యాలు వంటి సబ్జెక్టులను బోధించడానికి ఈ ట్యాబ్‌లను ఉపయోగిస్తారు. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట, ప్రతి పాఠశాల నాలుగు గంటలు ట్యాబ్‌లను వాడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేక ప్లాట్‌ఫాం ద్వారా ట్యాబ్‌ల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ, నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి అందిస్తుంది. అంతేకాదు ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు ప్రశంసాపత్రాలు, ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇన్ఫోసిస్‌లో అప్రెంటిస్‌షిప్ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. విద్యార్థులకు ఉపయోగంగాఈ ట్యాబ్ కంటెంట్ రాష్ట్ర కరిక్యులంకు అనుగుణంగా తయారు చేశారు. విద్యార్థులు వీడియో పాఠాలు చూసిన తర్వాత, వాటిపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసి తమను తాము మూల్యాంకనం చేసుకోవచ్చు. ఇది వారి అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య అందుతుందన్నారు సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు. గత ప్రభుత్వ హయాంలో కూడా విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు.. అయితే అప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాయి.