July September: మళ్లీ కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలైంది. ఎప్పటిలాగే మార్కెట్ విలువ పరంగా దేశంలో.. అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈసారి ఫలితాల్ని మొదలుపెట్టనుంది. గురువారం (అక్టోబర్ 9) రోజే అందుకు ముహూర్తం. టీసీఎస్ తర్వాతే.. ఇతర ఐటీ కంపెనీలు, ప్రధాన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఫార్మా కంపెనీలు ఫలితాల్ని ప్రకటిస్తుంటాయి. .. మార్కెట్‌ను ప్రభావితం చేసేలా కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఈసారి టీసీఎస్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి పరిణామాలు అందుకు కారణం. ముఖ్యంగా.. ఇటీవల ఈ కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 12 వేల మందిని తొలగించడం సహా వేతనాల పెంపు, అమెరికా డిమాండ్‌లో అనిశ్చితి, హెచ్1బీ వీసా ఇష్యూ ఇవన్నీ కంపెనీ ఫలితాల్లో ప్రతిబింబించనున్నాయి. దీంతో ఈసారి డిమాండ్ తగ్గిన క్రమంలో.. ఫలితాలు కూడా ఫ్లాట్‌గానే ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. BFSI, టెక్ సెక్టార్లలో డిమాండ్ కనిపించినా.. లైఫ్ సైన్స్, హెల్త్ కేర్ అండ్ కమ్యూనికేషన్స్‌లో పెద్దగా ఆర్డర్లు దక్కించుకోనందున లాభాదాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటి నడుమ ఫలితాలు ఫ్లాట్‌గా లేదా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇక్కడ ఫలితాల సమయంలోనే.. కంపెనీ మధ్యంతర డివిడెండ్‌పైనా ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. దీనికి అక్టోబర్ 15 రికార్డు డేట్‌గా ఉండొచ్చని అంటున్నారు. అంటే ఆలోపు టీసీఎస్ షేర్లు కలిగి ఉన్న వారికి టీసీఎస్ డివిడెండ్ వస్తుందన్నమాట. టీసీఎస్‌లో ఈ సమీక్షా త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందా లేదా అనేదానిపైనా ఉత్కంఠ నెలకొంది. >> ఇక ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు ధర లాభాల్లో ట్రేడవుతోంది. గురువారం సెషన్‌లో ఈ వార్త రాసే సమయంలో దాదాపు ఒక శాతం లాభంతో రూ. 3055.50 వద్ద ఉంది. ఇంట్రాడేలో రూ. 3060.50 వద్ద గరిష్ట ధరను నమోదు చేసింది. గత 3 రోజులుగా ఈ స్టాక్ పుంజుకుంటూనే ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 11.06 లక్షల కోట్లుగా ఉండగా.. అతిపెద్ద ఐటీ కంపెనీగా ఇదే ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 4494.90 కాగా.. కనిష్ట ధర రూ. 2866.60 గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మాత్రం ఈ స్టాక్ ధర 25 శాతానికిపైగా పతనమైంది. ఇక 52 వారాల గరిష్ట ధర నుంచి చూస్తే.. ఏకంగా 30 శాతానికిపైగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ సమయంలో నష్టపోయారు.