Tata Group Noel Tata: మన దేశంలోనే మంచి పేరుంది. ఈ ప్రతిష్టాత్మక టాటా గ్రూప్‌ను.. దిగ్గజ పారిశ్రామిక వేత్త, దివంగత రతన్ టాటా దశాబ్దాల పాటు ముందుండి నడిపించారు. గ్రూప్ ఛైర్మన్‌గా, టాటా ట్రస్ట్స్ అధిపతిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అయితే.. రతన్ టాటా చనిపోయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పుడు గ్రూప్ సంస్థల్లో ఉన్న సమన్వయం, వ్యక్తిగత ప్రభావం ఇప్పుడు కరువైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రతన్ టాటా మరణానంతరం కిందటేడాది అక్టోబర్ నెలలోనే .. టాటా ట్రస్ట్స్ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే టాటా ఉన్నంత వరకు.. ఆయన తీసుకునే ఏ నిర్ణయాన్ని ట్రస్టీలు లేదా నామినీ డైరెక్టర్లు ఏనాడూ ప్రశ్నించలేదు. ఇప్పుడు నోయల్ టాటాకు మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. రతన్ టాటా మాదిరిగా.. అధికారం చెలాయించలేకపోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా నోయల్ చేసే ప్రతి పనిని.. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ట్రస్టీలు.. భూతద్దంలోనే పెట్టి చూస్తున్నట్లు తెలుస్తోంది. ట్రస్టీల్లో కీలకంగా ఉన్న మెహిల్ మిస్త్రీ.. కొన్ని కీలక నిర్ణయాల్ని బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. ఈయనకు టాటా సన్స్‌లో వాటా ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబంతో అనుబంధం ఉంది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకం విషయంలో లుకలుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నామినీ డైరెక్టర్‌గా.. విజయ్ సింగ్‌ను తిరిగి నియమించాలనుకున్న ప్రతిపాదనను నలుగురు ట్రస్టీలు వ్యతిరేకించారు. టాటా సన్స్ బోర్డు సమావేశాల గురించి.. తమకు సరైన సమాచారం లభించట్లేదని వారు ఆరోపించారు. ఇక్కడ కొత్త నామినీ డైరెక్టర్లుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలోనూ సంఘర్ణణలు తలెత్తుతున్నాయి. మరో ముఖ్యమైన అంశం టాటా సన్స్ లిస్టింగ్ గురించి జరుగుతోంది. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 52 శాతం వరకు వాటా ఉంది. ఇంకా షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్.. టాటా సన్స్‌లోని తన 18.37 శాతం వాటాను ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో తనఖా పెట్టింది. దీనిని విడిపించుకునేందుకు ఇప్పుడు టాటా సన్స్ లిస్టింగ్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ టాటా సన్స్ లిస్టింగ్‌ను.. టాటా ట్రస్ట్స్ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. ఇక్కడే నోయల్ టాటా ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ట్రస్టీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్న క్రమంలో.. గ్రూప్ వివాదాల్ని చల్లార్చేందుకు స్వయంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నడుమ టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.. కేంద్రంలోని సీనియర్ అధికారుల్ని కలవనున్నట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం జరగనుంది. ఈసారైనా వివాదాస్పద అంశాలు కొలిక్కి వస్తాయా.. మళ్లీ గొడవలు జరుగుతాయా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.