ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంటోంది. చాలా మంది ఉద్యోగాలు.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలకు రాజీనామా చేయడం, మానసిక సమస్యలు తెచ్చుకోవడం, చివరికి ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే కార్పొరేట్ ప్రపంచంలో.. కంటే.. కంపెనీకి పని ముఖ్యం అని భావించే సంస్థలు.. ఉద్యోగుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పండగ సందర్భంగా ఒక కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. దీపావళి గిఫ్ట్ కింద.. ఏకంగా 9 రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది. ఢిల్లీకి చెందిన రియల్‌ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్‌, పీర్ సంస్థ ఎలైట్ మార్క్‌ సంస్థలు.. తమ ఉద్యోగులకు దీపావళి కానుకలు ప్రకటించాయి. సాధారణంగా దీపావళి గిఫ్ట్ అంటే ఉద్యోగులకు స్వీట్లు, ఇతర వస్తువులు, డబ్బు వంటివి కంపెనీలు అందిస్తూ ఉంటాయి. అయితే ఈ సంస్థలు మాత్రం.. తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం ఒక వినూత్నమైన బహుమతిని అందిచాయి. దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్ 18వ తేదీ నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఏకంగా 9 రోజులను సెలవుల రూపంలో గిఫ్ట్‌గా అందించాయి.రోజూ సంస్థలో తీవ్రమైన పనిలో నిమగ్నమై ఉంటున్న ఉద్యోగులకు.. కొంత బ్రేక్‌ అనేది చాలా ముఖ్యమని ఎంబసీ గ్రూప్‌ చీఫ్ హ్యూమన్ రీసోర్స్‌ ఆఫీసర్ మారియా రాజేష్ వెల్లడించారు. ఇలాంటి పండగల సందర్భంగా ఉద్యోగులకు బ్రేక్‌లు వారికి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని పేర్కొ్న్నారు. తమ సంస్థ అభివృద్ధికి పాటుపడే వారికి తాము విలువను ఇస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా ఈ హాలిడేస్‌లో తాము దీపావళి వేడుకలు నిర్వహించి.. ఉద్యోగులకు గిఫ్ట్‌లను ఇస్తుంటామని.. అంతేకాకుండా ఉద్యోగులకు మానసిక ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని కోసం వెల్‌బీయింగ్‌ ఆన్‌ ద వెబ్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ దసరా సెలవుల విషయాన్ని ఎలైట్ మార్క్‌ సీఈఓ రజత్‌ గ్రోవర్.. తమ కంపెనీ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపించి తెలిపారు. ఈ 9 రోజుల పాటు కంపెనీ పంపించే మెయిల్స్‌కు దూరంగా ఉండి.. రెస్ట్‌ తీసుకోవడంతోపాటు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఉద్యోగులకు సూచించారు. ఇక ఎన్నడూ ఊహించని బహుమతి కంపెనీ నుంచి వచ్చే సరికి.. అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు లింక్డ్‌ ఇన్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించే సంస్థలో పనిచేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆ వ్యక్తి తన పోస్ట్‌లో వెల్లడించారు. ఇలాంటి ఫెస్టివల్ బ్రేక్‌లు ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు మరింత క్రియేటివ్‌గా ఆలోచించేందుకు ఉపయోగపడతాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడి అయింది. అలాగే సరికొత్త ఉత్సాహంతో ఉద్యోగులు పనిమీద మరింత ఫోకస్ చేసేందుకు సహకరిస్తాయని వెల్లడించాయి.మరోవైపు.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో తమ ఉద్యోగులకు ఇలా వరుసగా సెలవులు ఇచ్చి వార్తల్లోకి ఎక్కింది. మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌ తర్వాత.. పూర్తిగా రెస్ట్ తీసుకుని.. తమపై తాము దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. సెలవుల తర్వాత కొత్త ఎనర్జీతో వస్తామని పేర్కొంది. కంపెనీలు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి విధానం ఉద్యోగాలకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయంటూ చెబుతున్నారు. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఆయా కంపెనీలు ఎంత విలువ ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం అవుతోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.