ఐటీ ఉద్యోగులకు షాక్.. టీసీఎస్‌లో 20 వేల మంది అవుట్.. మళ్లీ ఇలా జరిగిందేంటి?

Wait 5 sec.

: కొంత కాలంగా భారత ఐటీ రంగం తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం, భారతీయ వస్తువులు, ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని భారీగా పెంచడం వంటివి ఇందుకు కారణం. ఈ క్రమంలోనే దేశంలోని కార్పొరేట్ కంపెనీలు ఫలితాల సీజన్‌ను మొదలుపెట్టాయి. తొలుత మార్కెట్ విలువ పరంగా భారత అతిపెద్ద ఐటీ సంస్థ ప్రకటించింది. అంతకుముందులా రాణించలేదు. సమీక్షా త్రైమాసికంలో సంస్థ నికర లాభం కేవలం 1.39 శాతం మాత్రమే పెరిగి రూ. 12,075 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో ఇది రూ. 11,909 కోట్లుగా ఉంది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం మాత్రం స్వల్పంగా 2.39 శాతం పెరిగి రూ. 65,799 కోట్లుగా వచ్చింది. ఇక కిందటి త్రైమాసికంతో పోలిస్తే లాభం 5.3 శాతం తగ్గగా.. ఆదాయం మాత్రం 3.7 శాతం పెరిగింది. >> ఇక్కడే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు సంబంధించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య సమీక్షా త్రైమాసికంలో ఏకంగా 19,755 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కంపెనీ తన పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా సుమారు 12 వేల మంది ఉద్యోగుల్ని ప్రపంచవ్యాప్తంగా తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానికి అదనంగా ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుల్లో.. ప్రణాళిక ప్రకారం కొన్ని ఉండగా.. ప్రదర్శన బాలేదని తొలగించడం, బెంచ్ పాలసీ అడ్జస్ట్‌మెంట్స్ వంటివి కూడా దోహదం చేశాయని తెలుస్తోంది. ఇంకా కంపెనీ పునర్నిర్మాణం కోసం దాదాపు రూ. 1135 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులో లేఆఫ్ చేసిన ఉద్యోగులకు పరిహారం కూడా ఉందని పేర్కొంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 6,13,069 గా ఉండగా.. ఇప్పుడు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 5,93,314 కు చేరిందని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇక్కడ ఉద్యోగుల సంఘం NITES టీసీఎస్ చర్యపై విమర్శలు గుప్పించింది. సరైన సమాచారం ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిందని ఆరోపించింది. అయితే ఇక్కడ టీసీఎస్ సీహెచ్ఆర్ఓ సుదీప్ కున్నుమల్ ప్రకటన వేరేలా ఉంది. పునర్‌వ్యవస్థీకరణ కింద కంపెనీ ఒక శాతం ఉద్యోగులు అంటే 6 వేల మంది వరకు తొలగించినట్లు చెప్పడం గమనార్హం.