ఇందిరమ్మ ఇళ్లు పథకం: ఆ లబ్ధిదారులు రూ.లక్ష వెనక్కి ఇవ్వాల్సిందే.. ఎందుకంటే

Wait 5 sec.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలును వేగవంతం చేసింది. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇళ్లు మంజూరు చేసింది. వీటిల్లో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. త్వరలోనే గృహప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం నియమాలకు అనుగుణంగా.. ఇంటి నిర్మాణం ప్రకారం దశల వారీగా అధికారులు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అధికారులు కొందరు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన రూ.లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆ వివరాలు.. రాష్ట్రంలో పలువురు ఖాతాల్లో పొరపాటున అదనరంగా రూ.లక్ష చొప్పున జమ అయ్యాయని సమాచారం. ఈ విషయం కాస్త.. రాష్ట్ర గృహనిర్మాణశాఖ అధికారుల దృష్టికి రావడంతో.. వారు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదనంగా ఖాతాలో రూ.లక్ష జమ అయిన లబ్ధిదారులు ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,266 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.12.66 కోట్లకు పైగా అదనంగా జమ అయినట్లు తెలుస్తోంది. దసరా పండగకు ముందు ఇళ్ల నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు జమ చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్య వల్లనే పలువురు లబ్ధిదారుల ఖాతాలో అదనంగా డబ్బులు జమ అయ్యాయని.. ప్రస్తుతం ఆ నగదును వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైందని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారు.అదనపు నగదు జమ గురించి వెంటనే జిల్లాలవారీగా గృహనిర్మాణశాఖ పీడీలకు సమాచారం అందింది. దీంతో ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. లబ్ధిదారుల ఖాతాలో అదనంగా జమ అయిన రూ.లక్షను తిరిగి వచ్చేలా చూడాలని గృహనిర్మాణశాఖ జీఎం(ఫైనాన్స్) విభాగం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, అదనంగా జమ అయిన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లకు కూడా గృహనిర్మాణ శాఖ లేఖ రాసినట్లు సమాచారం.ఇలా అదనంగా రూ.లక్ష జమ అయిన లబ్ధిదారుల్లో.. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157 మంది ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 119 మంది..నిజామాబాద్ జిల్లాలో 91 మంది లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా డబ్బులు జమ అయ్యాయి. కొందరి నుంచి ఇప్పటికే ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టినట్లు సమాచారం. పలువురి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున అదనంగా జమ అయిన మాట నిజమేనని... అయితే సాంకేతిక సమస్య వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. అదనంగా జమ అయిన మొత్తాన్ని రికవరీ కూడా చేస్తున్నామని గృహనిర్మాణశాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.