బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. స్పందించిన తెలంగాణ ఎన్నికల సంఘం..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దీనిపై అధికారికంగా స్పందించింది. , ఈ రోజు విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాము పాటిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయం.. తెలంగాణ హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. హైకోర్టు ఈ అంశంపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. దీంతో.. ఆ గడువు ముగిసే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమలులో ఉండబోదని. సడలింపు లభించినట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో లేకపోవడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ఉన్న నియంత్రణలు తాత్కాలికంగా తొలగిపోతాయి. ఈ వాయిదా కాలంలో రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచార వ్యూహాలను తిరిగి సమీక్షించుకోవడానికి, అభ్యర్థుల ఎంపిక విషయంలో పునరాలోచన చేయడానికి అవకాశం లభించింది. ఆశావహుల్లో తీవ్ర నిరాశ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి.. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేయాలని ఆశించిన వేలాది మంది నాయకులు, లోనయ్యారు. గురువారం ఉదయం .. నామినేషన్లు దాఖలు చేయడానికి అంతా సిద్ధమై ఉన్న ఆశావహులు ఈ కోర్టు స్టే తో షాక్‌కు గురయ్యారు. జిల్లాలలోని ఆయా పార్టీ కార్యాలయాల వద్ద నోటిఫికేషన్ సందడి కారణంగా నాయకులు.. మద్దతుదారులతో కోలాహలం నెలకొంది. అయితే.. హైకోర్టు తీర్పు వెలువడగానే ఆ సందడి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అభ్యర్థిత్వం ఖరారైన తమ పార్టీ నాయకులతో మాట్లాడి నామినేషన్ పత్రాలు సమర్పించాలని ఆసక్తిగా ఎదురుచూసిన వారంతా ఈ పరిణామంతో తమ తమ నివాసాలకు వెనుదిరగాల్సి వచ్చింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తదుపరి ఎలాంటి న్యాయ పోరాటం చేస్తుందోననే ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.