తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మొక్కజొన్న పంటను మద్దతు ధరకే సేకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మొక్కజొన్న పంట సేకరణ విషయంపై.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర రైతుల సమస్యలను వివరించారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా.. కొనుగోళ్లకు ముందుకు రాలేదని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి సూచనతో.. రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ మార్క్‌ఫెడ్.. ద్వారా మొక్కజొన్న పంటను కొను గోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతఏడాది కూడా కేంద్రం కేవలం ప్రకటన మాత్రమే ఇచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు రూ.535 కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్రంలో పండిన మొక్కజొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. రైతులను నష్టాల నుంచి రక్షించేందుకు ఇదే విధానాన్ని ఈసారి కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మరోవైపు, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్ఎస్) కింద.. పెసర, మినుము, సోయా చిక్కుడు, కంది, వేరుశనగ వంటి పంటలను సేకరించడంపై కేంద్ర ప్రభుత్వం 25 శాతం సీలింగ్ విధించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. ఆ పరిమితిని మించి పంటలను సేకరిస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కేవలం మద్దతు ధర ప్రకటించడమే కాకుండా.. మొక్కజొన్న, జొన్న పంటలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, వివిధ పంటలపై ఉన్న 25 శాతం సీలింగ్‌ను ఎత్తివేయాలని కోరారు. అయితే, రైతులకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని మంత్రి తుమ్మల చెప్పారు. సగటున ఎకరాకు 18.50 క్వింటాల్ దిగుబడి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి ఉన్నట్లు అంచనా వేశామన్నారు. ఈ సీజన్‌లో 8,66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను సేరకించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొక్కజొన్నకు బోనస్ కూడా ఇవ్వండి..2025-26 మార్కెటింగ్ సీజన్‌లో ఖరీఫ్ పంటలకు గతంలోనే కేంద్ర మద్దతు ధర ప్రకటించింది. దాని ప్రకారం.. మొక్కజొన్న క్వింటాకు రూ.2400 నిర్ణయించింది. అయితే ఈ ధరకే మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని అక్టోబర్ 8న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. దాంతో పాటు కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్లు.. రూ. 330 బోన‌స్ ఇవ్వాలన్నారు.