వన్డే కెప్టెన్‌గా నియమితులైన తర్వాత తొలిసారి మీడియా ఎదుటకు వచ్చాడు. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టెస్టుకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గిల్.. టీమిండియా వన్డే కెప్టెన్సీపై స్పందించాడు. స్థానంలో వన్డే కెప్టెన్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవమని, అంతకంటే పెద్ద బాధ్యత అని కూడా అన్నాడు. రోహిత్ శర్మను తప్పించి, వన్డే క్రికెట్ పగ్గాలు తనకు అప్పగిస్తున్నారన్న విషయం ముందుగానే తెలుసని గిల్ తెలిపాడు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అధికారికంగా ప్రకటించే ముందు తనకు ఈ విషయం తెలుసంటూ పేర్కొన్న గిల్.. భవిష్యత్‌పై దృష్టి పెట్టానని చెప్పాడు. “టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే నాకు కొంత ముందే సమాచారం ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద గౌరవం, అలాగే గొప్ప బాధ్యత కూడా. దేశాన్ని నడిపే అవకాశం రావడం ఏ ఆటగాడికైనా గర్వకారణమే” అని గిల్ అన్నాడు. ఇటీవలే భారత టెస్ట్ జట్టుకి కూడా నాయకత్వం వహించడం ప్రారంభించిన గిల్, ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ తన సామర్థ్యాన్ని నిరూపించాలని సంకల్పించాడు. “భవిష్యత్తు ఎలాంటి అవకాశాలు ఇస్తుందో చూడటానికి ఆసక్తిగా ఉన్నాను. ఇప్పటివరకు సాధించిన విజయాలపై దృష్టి పెట్టడం కంటే, రాబోయే పోటీల్లో గెలవడంపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను” అని గిల్ స్పష్టంగా తెలిపాడు. రోహిత్ శర్మ గురించి గిల్ మాట్లాడుతూ “రోహిత్ భాయ్‌ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకు ఉన్న శాంత స్వభావం, అలాగే జట్టులో స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించే తీరు నాకు ఎంతో ప్రేరణగా ఉంటుంది. ఈ లక్షణాలను నేనూ కొనసాగించాలి అనుకుంటున్నాను” అని గిల్ చెప్పాడు. రోహిత్ శర్మ సారథ్య శకం ముగిసన తర్వాత భారత వన్డే జట్టులో ఇది నూతన అధ్యాయానికి నాందిగా అందరూ భావిస్తున్నారు. శుభమన్ గిల్‌కి ఉన్న ఆటతీరు, ఆత్మవిశ్వాసం, స్థిరమైన దృష్టి జట్టును ముందుకు నడిపించగలవని నిపుణుల అభిప్రాయం.