ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతి విజేతను ఇవాళ నోబెల్ కమిటీ ప్రకటించింది. వరించింది. వెనెజులాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజల కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్న మరియా కొరినా మచాడోకు ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక తనకు నోబెల్ శాంతి బహుమతి రావడంపై .. సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో వెనెజులా ప్రజలతోపాటు తమ ఉద్యమానికి మద్దతుగా డొనాల్డ్‌ ట్రంప్‌ నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన ఈ నోబెల్ పురస్కారాన్ని ట్రంప్‌కు అంకితం ఇస్తున్నానని మరియా కొరినా మచాడో చెప్పారు.వెనెజువెలా ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించడం తమ పోరాటం ముగిసేందుకు ఉపయోగపడుతుందన మరియా కొరినా మచాడో పేర్కొన్నారు. వెనెజులా ప్రజలు స్వేచ్ఛ పొందేందుకు ఊతమిస్తుందని తెలిపారు. తాము విజయానికి దగ్గరలో ఉన్నామని.. గతంలో ఎన్నడూ లేనంతగా డొనాల్డ్ ట్రంప్‌, అమెరికా, లాటిన్‌ అమెరికా ప్రజలపై ఆధారపడతామని వెల్లడించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు తమకు ప్రధాన మిత్రులు అని.. ఈ పురస్కారాన్ని కష్టాల్లో ఉన్న వెనెజులా ప్రజలతోపాటు మా పోరాటానికి మద్దతు ఇస్తున్న ట్రంప్‌నకు అంకితం చేస్తున్నా అని మరియా స్పష్టం చేశారు.అంతకుముందు.. నార్వే నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ క్రిస్టియన్‌ బ్రెగ్‌ హార్ప్‌క్వెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మరియా కొరినా మచాడో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వనున్న విషయాన్ని ఆమెకు ముందుగానే నోబెల్ కమిటీ తెలియజేసింది. ఇక తనకు ఈ పురస్కారం రావడాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. తనకు మాటలు రావట్లేదని.. వెనెజులా ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే తాము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని.. దాని కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని.. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదో ఉద్యమం అని అర్థం చేసుకున్నారని భావిస్తున్నానని.. ఇది తన ఒక్క గెలుపు కాదని.. వ్యక్తిగతంగా తాను దీనికి అర్హురాలిని కాదని అనుకుంటున్నానని చెప్పారు. ఇది వెనెజులా సమాజం మొత్తం సాధించిన విజయమని.. తమ ప్రజలకు లభించిన అతిపెద్ద గుర్తింపు అని మరియా కొరీనా స్పష్టం చేశారు.వెనెజులా ప్రజల హక్కుల కోసం విశ్రాంతి లేని పోరాటం చేసినందుకు గాను మరియా కొరినాకు ఈ నోబెల్ శాంతి పురస్కారం అందిస్తున్నట్లు నార్వే నోబెల్‌ కమిటీ తెలిపింది. వెనెజులాను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు.. శాంతి మార్గంలో తీసుకువచ్చేందుకు ఆమె విశేష కృషి చేశారని పేర్కొంది. ఈ క్రమంలోనే మరియాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయని.. ఏడాది కాలంగా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది.